డీటీసీపీ లేఔట్ పరిశీలన
తాండూరు: అడిషనల్ కలెక్టర్ సుధీర్ మంగళవారం తాండూరు మున్సిపల్ పరిధిలో పర్యటించారు. హైదరాబాద్ మార్గంలో కొత్తగా ఏర్పాటు చేసిన డీటీసీపీ లేఔట్ను తనిఖీ చేశారు. అనంతరం తాండూరు మున్సిపల్ పాలనపై ఆరా తీశారు. కమిషనర్ యాదగిరి, శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కార్మికుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ వచ్చిన వార్తా కథనాలపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
వేటకు వెళ్లిన కూలీ
విద్యుదాఘాతంతో మృతి
మోమిన్పేట: విద్యుదాఘాతంతో ఓ కూలీ మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ అరవింద్ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని గోవిందాపూర్ శివారులో ఉన్న ఓ వెంచర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేవనకొండ మండలం నేలతలమారికి చెందిన ముట్టిబోయ రామకృష్ణ, మునిరంగడు(40) సోదరులు కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరు సోమవారం రాత్రి వేటకు వెళ్లారు. ఈ క్రమంలో గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 68లో మొక్కజొన్న పంట రక్షణకు వేసిన విద్యుత్ తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురైన మునిరంగడు అక్కడికక్కడే మృతి చెందాడు. రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత
ఇబ్రహీంపట్నం రూరల్: అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను మహేశ్వరం జోన్ ఎస్ఓటీ, ఆదిబట్ల పోలీసులు మంగళవారం సాయంత్రం పట్టుకున్నారు. సీఐ రవికుమార్ కథనం ప్రకారం.. నాదర్గుల్లో నివాసం ఉండే మారగోని అశోక్(61) సాయంత్రం ఓలా ఎలక్ట్రిక్ బైక్ మీద అక్రమంగా 42.5 లీటర్ల వివిధ రకాల బ్రాండ్లకు సంబంధించిన మద్యం, బీర్లను తరలిస్తున్నాడు. నమ్మదగిన సమాచారంతో పోలీసులు దాడి చేసి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో అశోక్పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


