చదువే ఆయుధం
● స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
● ఘనంగా జాతీయ విద్య, మైనారిటీ సంక్షేమ దినోత్సవం
అనంతగిరి: దేశ భవిష్యత్తును మార్చగల శక్తి విద్యకు మాత్రమే ఉందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. మంగళవారం భారత రత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని వికారాబాద్లోని మైనారిటీ బాలికల గురుకుల జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో జాతీయ విద్య, మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఆధునిక విద్యకు శ్రీకారం చుట్టిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన అడుగు జాడల్లో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో ఎనిమిది లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రత్యేక చొరవతో ప్రభుత్వ వసతి గృహాలకు అన్ని వసతులు సమకూరుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజా ప్రభుత్వం వచ్చాకే డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసినట్లు పేర్కొన్నారు. వికారాబాద్లో గురుకులాల ఏర్పాటుకు 5 ఎకరాల భూమి కేటాయించాలన్నారు. అనంతరం కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు, యువతీయువకులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఆర్టీఏ సభ్యుడు జాఫర్, కళాశాల ప్రిన్సిపాల్ మహబూబా ఫాతిమా, మైనార్టీ నాయకులు మహమ్మద్ హఫీజ్, వహీద్, ఆశం, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిరస్మరణీయుడు మౌలానా
అనంతగిరి: మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయమని అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో, కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రిగా ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరచిపోలేమన్నారు. మంగళవారం కలెక్టరేట్లో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అబుల్ కలాం ఆజాద్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అబుల్ కలాం సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ మంగీలాల్, ఏఓ పరహీన తదితరులు పాల్గొన్నారు.
నివాళులర్పిస్తున్న అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, ఇతర అధికారులు
సమావేశంలో మాట్లాడుతున్న స్పీకర్ ప్రసాద్కుమార్
చదువే ఆయుధం


