
డబ్బు కోసం వేధింపులు
మణికొండ: తాను కొనుగోలు చేసిన స్థలంలో ఇంటిని నిర్మింకుంటున్న ఓ వ్యక్తిని మాజీ కార్పొరేటర్ ఏకంగా రూ. 10 లక్షలు డిమాండ్ చేశాడు. అంత ఇచ్చుకోలేనని బతిమాలినా వినిపించుకోకుండా డబ్బులు ఇవ్వకపోతే లోపల వేసి కొడతానని బెదిరించాడు. మాజీ కార్పొరేటర్ అడిగింది ఇచ్చి సమస్య తీర్చుకోవాలని టౌన్ప్లానింగ్ అధికారి(టీపీఓ) పలు మార్లు నిర్మాణ సామగ్రిని తీసుకెళ్లి మరో వైపు వేధించాడు. వాటిని తాళలేక స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ను బాధితుడు అశ్రయించాడు. ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ మేయర్కు సిఫారసు చేసి సమస్యను పరిష్కరించాలని సూచించారు. మాజీ డిప్యూటీ మేయర్ ఇంట్లో పంచాయతీ పెట్టి చివరకు రూ. 4 లక్షలు చెల్లించాడు. అయినా వేధింపులు ఆగక పోవటంతో బాధితుడు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మాజీ కార్పొరేటర్ శ్రీనాథ్రెడ్డితో పాటు అతని అనుచరుడు సందీప్రెడ్డిలను అరెస్టు చేశారు. బాధితుడు నానాజీ శనివారం మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం... ఓ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తూ హైదర్షాకోట్లో 100 గజాల పాత ఇంటిని ఇటీవల కొనుగోలు చేశానన్నారు. పాత ఇంటిని తొలగించి కొత్త ఇంటి నిర్మాణం చేపడుతుండటంతో మాజీ కార్పొరేటర్ శ్రీనాథ్రెడ్డి రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడన్నారు. తను కొనుగోలు చేసిన స్థలంలో ఇంటి నిర్మాణం చేపడితే డబ్బు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించానన్నాడు. దాంతో మాజీ కార్పొరేటర్ టీపీఓ రాకేష్కు చెప్పి పనులను పలుమార్లు నిలుపుదల చేయటం, నిర్మాణ సామగ్రి తీసుకెళ్లి వేధించారన్నారు.
ఎమ్మెల్యేకు ఫిర్యాదు
తన స్థలంలో తను ఇంటి నిర్మాణం చేస్తుంటే మాజీ కార్పొరేటర్ వేధిస్తున్నాడని బాధితుడు నానాజీ ఇటీవల ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ను కలిసి ఫిర్యాదు చేశాడు. దాంతో ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ మేయర్ రాజేందర్రెడ్డికి ఫోన్ చేసి అతన్ని వేధించవద్దని మాజీ కార్పొరేటర్కు చెప్పాలని సూచించాడు. అయినా మాజీ కార్పొరేటర్ పట్టు వీడకుండా టీపీఓతో కలిసి వేధించటంతో మాజీ డిప్యూటీ మేయర్ ఇంట్లో ఇటీవల సమావేశం అయి మాజీ కార్పొరేటర్కు చివరకు రూ. 3 లక్షలు నగదుగా, రూ. లక్ష ఆన్లైన్లో చెల్లించాడు. సమస్య తీరిందని అనుకున్నా తనను వదలకుండా మరో మారు డబ్బులు ఇవ్వాలని వేధించటంతో శుక్రవారం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశానన్నాడు. ఫిర్యాదులో మాజీ కార్పొరేటర్ శ్రీనాథ్రెడ్డి, అతని అనుచరుడు సందీప్రెడ్డి, టీపీఓ రాకేష్లు వేధించినట్టు పేర్కొన్నానని బాధితుడు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు శనివారం మాజీ కార్పొరేటర్, అతని అనుచరున్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు సమాచారం. టీపీఓ పాత్రపైన విచారణ చేస్తున్నట్టు తెలిసింది. ఈ కేసు విషయమై నార్సింగి ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డిని వివరణ కోరేందుకు ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదు.
మాజీ కార్పొరేటర్ అరెస్టు
ఇంటి నిర్మాణానికి రూ. 10 లక్షలు డిమాండ్
శ్రీనాథ్రెడ్డికి టీపీఓ వత్తాసు
ఎమ్మెల్యేను ఆశ్రయించిన బాధితుడు
మాజీ డిప్యూటీ మేయర్ వద్ద రూ. 4 లక్షలు చెల్లింపు
అయినా ఆగని వేధింపులతో పోలీసులకు బాధితుడి ఫిర్యాదు