
కలిసి పనిచేద్దాం కారెక్కండి
మహరాజుల కుటుంబాన్ని కోరిన ‘పైలెట్’ మాజీ ఎమ్మెల్యే నారాయణరావుతో భేటీ బీఆర్ఎస్ నుంచి ఎంపీపీ, జెడ్పీటీసీ ఇస్తామని ఆఫర్ కాంగ్రెస్ నిర్ణయం తేలాక చెబుతామన్న మహరాజులు
బషీరాబాద్: జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి. అధికార కాంగ్రెస్పై పైచేయి సాధించాలని ప్లాన్ వేసిన గులాబీ పార్టీ ఆదిశగా అడుగులు వేస్తోంది. తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అంటేనే మొదట గుర్తొచ్చేది బషీరాబాద్లోని మహరాజుల కుటుంబం. ఈ ఫ్యామిలీకి పదవుల ఎర వేసి కారెక్కించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి మంగళవారం మాజీ ఎమ్మెల్యే నారాయణరావుతో సమావేశమయ్యారు. బషీరాబా ద్లోని ఆయన నివాసానికి వెళ్లి సుమారు 45 నిమి షాల పాటు భేటీ కావడం చర్చనీయాంశమైంది.
వెల్కమ్ టు బీఆర్ఎస్ అంకుల్!
విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం సాయంత్రం 4.50 గంటలకు నారాయణరావు నివాసానికి చేరుకున్న రోహిత్రెడ్డి ‘నమస్తే అంకుల్.. ఎలా ఉన్నారు..? ఆరోగ్యం ఎలా ఉంది.. అంటూ పాదాభివందనం చేశారు. ఇక వెయిట్ చేయడం వేస్ట్.. వెల్కమ్ టు బీఆర్ఎస్ అంకుల్.. కలిసి పనిచేద్దాం.. కారెక్కండి’ అని ఆహ్వానించారు. దీనికి నారాయణరావు.. నవ్వుతూ ‘కమింగ్ సూన్..’ అంటూ సమాధానం ఇచ్చారు. అనంతరం 30నిమిషాల పాటు నేతలిద్దరూ పలు అంశాలపై చర్చించారు. ఎన్నికల్లో మీరు అడిగిన సీట్లు ఇవ్వడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉంది.. పార్టీలో చేరండి అని పైలెట్ కోరారు. దీనికి నారాయణరావు బదులిస్తూ.. ‘వెంకటేశ్ మహరాజ్కు కాంగ్రెస్ తరఫున ఎంపీపీ సీటు ఖరారైంది. రాకేశ్మహరాజ్కు జెడ్పీటీసీ అడిగాం.. ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. మేము అజయ్ప్రసాద్తో కలిసి ఎన్నికల్లో పనిచేయడానికి సిద్ధంగా లేము.. నాలుగు దశాబ్దాలుగా నియోజకవర్గంలో ఎవరికి పదవులు కావాలన్నా మా కుటుంబం టికెట్లు ఇచ్చింది. ఇప్పడు టికెట్లు కావాలని వారిని అడుక్కునే పరిస్థితి నెలకొంది. జెడ్పీటీసీ టికెట్పై కాంగ్రెస్ నిర్ణయం కోసం 24గంటలు వేచి చూస్తాం. ఆతర్వాత అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాం’.. అని చెప్పారు. అనంతరం మరో గదిలోకి వెళ్లిన ఇద్దరు నేతలు 15 నిమిషాల పాటు ఏకాంతంగా చర్చించుకున్నారు. వీరి భేటీలో బీఆర్ఎస్ నాయకులు ఇందర్చెడ్ రాజు, అఫూ, నయ్యూం, సిఖిందర్ఖాన్, మునీందర్రెడ్డి, రంగారెడ్డి, రజాక్, సునీల్ ప్రసాద్, నర్సిములు, కాంగ్రెస్ నాయకులు సిద్దార్థ్ ఉన్నారు.
కాంగ్రెస్కు గుణపాఠం తప్పదు
తాండూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో పెద్దేముల్, తాండూరు, యాలాల, కోట్పల్లి, బషీరాబాద్ మండలాల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమాన్ని ఇంటింటికి తీసుకెళ్లి ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలను సొంతం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ ఆయా మండలాల అధ్యక్షులు రవీందర్రెడ్డి, నర్సిరెడ్డి, సురేందర్, నాయకులు శ్రీనివాసాచారీ, పట్లోళ్ల నర్సింహులు, శ్రీనివాస్రెడ్డి రాజప్ప తదితరులు పాల్గొన్నారు.

కలిసి పనిచేద్దాం కారెక్కండి