
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
యాలాల: పాత తాండూరు కాగ్నా నది నుంచి ఇసుక అనుమతి పొందిన ఓ ట్రాక్టర్ మండల పరిధి నుంచి రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకొని సీజ్ చేశారు. ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు రెవెన్యూ అధికారుల నుంచి ఇసుక తరలింపునకు అనుమతి పొందిన ఓ ట్రాక్టర్ గురువారం మండల పరిధిలోని గోవిందరావుపేట కాకరవేణి నది నుంచి ఇసుకను దర్జాగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన వాహన డ్రైవర్ వద్ద పాత తాండూరు కాగ్నా నది నుంచి ఇసుక తరలింపునకు తహసీల్దార్ జారీ చేసిన అనుమతిని పోలీసులు గుర్తించారు. కాగా పట్టుబడిన ట్రాక్టర్ ఓ రాజకీయ నాయకుడిది కావడంతో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయమై సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. పట్టుబడిన ట్రాక్టరును శాఖపరమైన చర్యల నిమిత్తం యాలాల తహసీల్దార్కు అప్పగించనున్నట్లు ఎస్ఐ తెలిపారు.
పేకాటరాయుళ్ల అరెస్టు
బషీరాబాద్: పేకాట ఆడుతున్న ముగ్గురిని బషీరాబాద్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఎస్ఐ నుమాన్ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మైల్వార్ గ్రామానికి చెందిన బక్కప్ప ఇంట్లో మద్యం తాగుతూ యాదప్ప, అశోక్లు పేకాట ఆడుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వీరి నుంచి రూ.2వేల నగదు, రెండు సెల్ఫోన్లు, పేకముక్కలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.
దత్త పీఠాన్ని సందర్శించుకున్న స్పీకర్
అనంతగిరి: దిండిగల్లోని అవధూత దత్త పీఠాన్ని గురువారం స్పీకర్ ప్రసాద్కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు స్పీకర్కు తీర్థ ప్రసాదాలు అందజేసీ ఆశీర్వచనాలు అందచేశారు.
సీఎంను కలిసిన లగచర్ల నాయకులు
దుద్యాల్: మండలంలోని లగచర్ల, హకీంపేట్ గ్రామాల నాయకులు గురువారం నగరంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిశారు. మండలంలో ఏర్పాటు చేయనున్న పారిశ్రామిక వాడ పనులు వేగవంతంగా చేయాలని కోరారు. సీఎంను కలిసిన వారిలో మాజీ సర్పంచ్ అనంతయ్య, నాయకులు యుగంధర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, ప్రభాకర్ ఉన్నారు.
విద్యుత్ షాక్తో రైతు మృతి
షాబాద్: విద్యుత్ షాక్తో ఓ రైతు మృతిచెందిన ఘటన షాబాద్ పీఎస్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఊబగుంట గ్రామానికి చెందిన బుడ్డమోళ్ల చంద్రయ్య(60) రోజు మాదిరిగానే ఉదయం పొలానికి వెళ్లాడు. వరి పంటకు నీరు పెట్టేందుకు మోటారు ఆన్ చేస్తుండగా షాక్కు గురై అక్కడికక్కడే కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్లో చేవెళ్ల ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యు లు నిర్ధారించారు. మృతుడి తమ్ముడు దరశథ ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇసుక ట్రాక్టర్ పట్టివేత