కానరాని క్వాలిటీ
రోడ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించక మూణ్నాళ్లకే పాడవుతున్నాయి. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నా పర్యవేక్షణ లోపంతో అవి దుర్వినియోగం అవుతున్నాయి. అధికారులను పర్సెంటేజీల పేరిట ప్రసన్నం చేసుకుంటున్న కాంట్రాక్టర్లు నాసిరకంగా పనులు చేపట్టడంతో అవిఅధ్వానంగా మారుతున్నాయి.
ఇసుకకు బదులు డస్ట్ వాడుతున్న కాంట్రాక్టర్లు
● చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు ● పర్సెంటేజీల మాటున పర్యవేక్షణ కరువు ● మంజూరవుతున్న నిధుల్లో 50 శాతమే పనులకు ● మూణ్నాళ్ల ముచ్చటగా అభివృద్ధి పనులు
వికారాబాద్: ఫొటోలో కనిపిస్తున్న పెద్దేముల్ మండలం గాజీపూర్–బుద్దారం వంతెన నిర్మాణానికి రూ.3.30 కోట్ల నిధులు వెచ్చించారు. ఐదేళ్ల క్రితం ప్రారంభించిన పనులు 2023 ఏడాది చివరిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఏడాది తిరక్కుండానే వంతెనపై సిమెంట్ పెచ్చులూడి చువ్వలు తేలాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఇలా అన్ని విభాగాల్లోనూ నాణ్యతను విస్మరించి అభివృద్ధి పనులు చేపడుతున్నారు.
నాణ్యత నేతిబీర చందమే..
అభివృద్ధి పనుల్లో క్వాలిటీ పూర్తిగా కంట్రోల్ తప్పుతోంది. పనులు నిర్వహించే శాఖ ఏదైనా నా ణ్యత మచ్చుకై నా కనిపించడం లేదు. కోట్లు వెచ్చించి చేపడుతున్న అభివృద్ధి పనులు ఏడాది తిరక్కుండానే పాడవుతున్నాయి. ఇంజనీరింగ్ వ్యవస్థ గాడితప్పింది. పనులేవైనా పర్సెంటేజీలే పరమావధిగా వ్యవహారం కొనసాగుతుందనే అపవాదు ఉంది. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ ఇలా శాఖ ఏదైనా పనుల పర్యవేక్షణ పట్టించుకునే వారు కరువయ్యారు. వర్క్ ఇన్స్పెక్టర్, ఏఈ, డీఈ, ఈఈ, జిల్లా స్థాయి అధికారులు, క్యూసీ(క్వాలిటీ కంట్రోల్) అధికారులు అంతా మామూళ్ల మత్తులో ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో కాంట్రాక్టర్లు ఇష్టానుసారం పనులు చేపట్టడంతో అవి నిరుపయోగంగా మారుతున్నాయి. ఇంజనీరింగ్ విద్యనభ్యసించిన కలెక్టర్ పనుల నాణ్యతపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
50 శాతమే నిధుల వినియోగం
అభివృద్ధి పనులు కాంట్రాక్టర్లు చేపట్టినా.. సర్పంచ్ లు, ఎంపీటీసీలు చేపట్టినా అధికారుల వాటా ముట్టజెప్పాల్సిందే అనే చర్చలు వినిపిస్తున్నాయి. ఏఈకి ఐదు శాతం,డీఈకి మూడు శాతం, ఈఈకి రెండు శాతం,సెక్షన్లో రెండు శాతం,క్యూసీకి రెండు శాతం ఇలా మొత్తంగా ప్రతీ పనికి 14 నుంచి 15 శా తం వరకు పర్సెంటేజీలు వసూలు చేస్తున్నారనే ఆ రోపణలు ఉన్నాయి.కాంట్రాక్టర్లకు పనులు ఇప్పించే ప్రజాప్రతినిధులు ప్రతీ పనికి 15 శాతం వరకు తీసుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా కాంట్రాక్టర్లు 30శాతం పర్సెంటేజీలు ఇస్తూ.. మరో 20 శాతం వారి లాభాలను కలుపుకొని ప్రభు త్వం మంజూరు చేసిన నిధుల్లో 50శాతం మాత్రమే పనులకు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.
రూ. వందల కోట్లతో పనులు
ప్రతీ ఏడాది జిల్లాకు మహాత్మాగాంధీ ఎన్ఆర్ఈజీఏలో మెటీరియల్ కంపోనెంట్ కింద ప్రభుత్వం రూ.50–రూ.60 కోట్ల నిధులు కేటాయిస్తోంది. సీడీ పీ, జెడ్పీ, సెంట్రల్ నిధులు, ప్రజా ప్రతినిధుల చొర వతో మంజూరు చేయించే నిధులు కలుపుకొంటే మొత్తంగా జిల్లాలో పంచాయతీ రాజ్ విభాగం ద్వా రానే రూ.వంద కోట్ల వరకు పనులు జరుగుతున్నా యి. మరో రూ.వంద కోట్లకుపైగా ఆర్అండ్బీ, మున్సిపాలిటీలకు మంజూరయ్యే నిధులు, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, హెల్త్, ఎడ్యుకేషన్ ఇలా వివిధ రకాల నిధులతో ప్రతి ఏటా పనులు చేపడుతుండ గా నాణ్యత పాటించడం లేదు. సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, డ్రైనేజీ, భవన నిర్మాణాల పనులు చేపడుతుండగా ఇంజనీరింగ్ అధికారుల నిర్వాకంతో పనులు మూణ్నాళ్ల ముచ్చటగా మారుతున్నాయి.
ఇసుకకు బదులు డస్ట్
కాంట్రాక్టర్లు సిమెంట్ పనుల్లో ఇసుకకు బదులుగా డస్ట్ వినియోగిస్తున్నారు. 20 శాతం ఇసుకకు 80 శాతం డస్ట్ కలుపుతున్నారు. మార్కెట్లో ఒక లారీ ఇసుకకు రూ.50వేల వరకు ఉంటుండగా డస్ట్కు రూ.10 వేలలోనే లభిస్తుంది. దీంతో కాంట్రాక్టర్లు డస్ట్ వినియోగిస్తూ.. అధికారులు ఇస్తున్న అంచనాల్లో ఇసుక వాడుతున్నట్లు చూపుతున్నారు. బిల్లులు దండుకుంటున్న కాంట్రాక్టర్లు డస్ట్ వాడుతుండడంతో చేపట్టిన పనులు వెంటనే పాడవుతున్నాయి.
చర్యలు తీసుకుంటాం
నాణ్యత విషయంలో రాజీ ఉండదు. నిబంధనల ప్రకారమే పనులు చేయించేలా చూస్తాం. ఎక్కడయినా అలాంటివి ఉంటే పర్యవేక్షిస్తాం. అవసరమైతే మళ్లీ వేయిస్తాం. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే వివరణ ఇవ్వాల్సిందే. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం. పెద్దెముల్ సమీపంలో పాడై న వంతెనను పరిశీలించి సమస్యను పరిష్కరిస్తాం.
– లాల్సింగ్, ఈఈ, ఆర్అండ్బీ
కానరాని క్వాలిటీ


