
ఆక్రమణలు ఆపేదెవరు!
కోర్టు ఆదేశాలనూ పట్టించుకోని వైనం
వికారాబాద్: పై ఫొటోలో కనిపిస్తున్న ప్రహరీ నిర్మాణం పరిగి మున్సిపల్ పరిధిలోని నజిరాబాద్ రెవెన్యూ సర్వే నంబర్ 99లో చేపట్టారు. కొందరు వ్యక్తులు ఆ భూమిలో మున్సిపల్ అధికారుల అనుమతి లేకుండా నిర్మాణ పనులు చేపట్టారు. రెవెన్యూ నుంచి నాలా కన్వర్షన్ కూడా చేయలేదు. వాల్టా చట్టాన్ని తుంగలో తొక్కి బోరుబావి తవ్వించారు. రికార్డుల్లో ఉన్న నాలాను సైతం కలిపేసుకున్నారు. ఇందులో మరో ట్విస్టుకూడా ఉంది. అసలు ఈ సర్వే నంబర్ భూమి ఇరువురి మధ్య వివాదంతో కోర్టు పరిధిలో కేసు నడుస్తోంది.. బాధిత వ్యక్తి మరోసారి కోర్టును ఆశ్రయించగా ఆ సర్వే నంబర్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని.. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్, ఇరిగేషన్ శాఖల అధికారులను ఆదేశించింది. అయితే వివాదాస్పద స్థలంలో నిర్మాణాలు జరుగుతున్నా.. నాలాను పూడ్చేసినా ఆయా శాఖల అధికారులు పట్టించుకోవడంలేదు. అక్రమ నిర్మాణాలు చేపట్టే సమయంలో బాధిత రైతు పలుమార్లు అధికారుల ఫిర్యాదు చేశారు. కోర్టు ఇచ్చిన నోటీసులు చూపాడు. కానీ ఫలితం లేకపోయింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.. ఇలాంటి కబ్జాలు వికారాబాద్, తాండూరు, కొడంగల్, పరిగి మున్సిపల్ పరిధిలో అనేక చోట్ల జరుగుతూనే ఉన్నాయి. ఫిర్యాదులు అందినా.. అధికారులు లంచాలకు ఆశపడి కబ్జా కోరులకే వత్తాసు పలకుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
చూసీచూడనట్లుగా..
భూ కబ్జాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. భూముల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో కబ్జాలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. చెరువులు, కుంటలు, నాలాలు, వాగులు.. దారులు ఇలా దేన్నీ వదలడం లేదు. మున్సిపాలిటీల పరిధిలో భూములకు రెక్కలు రావడంతో ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలను సైతం మింగేస్తున్నారు. ప్రైవేటు భూముల్లోనూ వివాదాలు సృష్టించి సెటిల్మెంట్లు చేసుకొని సొమ్ము చేసుకుంటున్నారు. మరి కొన్ని చోట్ల చెరువులను ఆక్రమించి పంటలు వేస్తున్నారు. ఆ పొలాలు తమవేనంటూ కంచెలు కూడా వేసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల ఆక్రమించుకున్న భూములను విక్రయించి జేబులు నింపుకొంటున్నారు. ఈ విషయం అధికారుల దృష్టికి వచ్చినా.. ఎవరైనా ఫిర్యాదు చేసినా.. విచారణ పేరుతో సాగతూస్తున్నారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. కబ్జారాయుళ్లు చెరువు శిఖాలను, బఫర్ జోన్ల సైతం వదలడం లేదు. తహసీల్దార్ మొదలుకొని ఇరిగేషన్, మున్సిపల్, పోలీసు, అడిషనల్ కలెక్టర్, కలెక్టర్ వరకు ఫిర్యాదులు అందినా ఎవరూ స్పందించిన దాఖలాలు లేవు.
చెరువులు, నాలాల కబ్జా
గతంలో మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల, కుంటల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. పూడిక తీయడంతోపాటు ఎక్కడైన చెరువులు ఆక్రమణకు గురైతే ఆ భూమిని స్వాధీనం చేసుకొని హద్దులు ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే నీటి పారుదల శాఖ అధికారులు ఏ చెరువులో కూడా కబ్జాల జోలికి వెళ్లలేదు. దీంతో ఆక్రమణలు ఇంకా పెరుగుతూ వచ్చాయి. ప్రధానంగా మున్సిపల్ కేంద్రాలకు సమీపంలోని చెరువులు, నాలాలే ఎక్కువగా కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి.
ఆక్రమణలకు గురైనవి..
వికారాబాద్ సమీపంలోని శివారెడ్డిపేట చెరువు, కొంపల్లి చెరువు, తాండూరుకు ఆనుకొని ఉన్న గొల్లచెరువు, పరిగి టెలిఫోన్ ఎక్చేంజ్ వెనుకగల నాలా, అనురాగ్, మైత్రి వెంచర్లకు ఆనుకొని ఉన్న నాలాలు ఆక్రమణలకు గురయ్యాయి.
రికార్డులు తారుమారు
చెరువులు, కుంటలు, దారులు, పానాదులు, నాలాలకు సంబంధించిన రికార్డులు చాలా వరకు తారుమారయ్యాయి. రెవెన్యూ రికార్డులే కాకుండా నీటిపారుదల శాఖ వద్ద కూడా చెరువులకు సంబంధించిన రికార్డులు కనిపించడం లేదు. కొన్ని చెరువులు భౌతికంగా కనిపిస్తున్నా రికార్డుల్లో మాత్రం చెరువు కనిపించడం లేదు. పానాదులు, నాలాలు పూడ్చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కబ్జాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తే అధికారులు అక్రమార్కులతో కుమ్మకై ్క వారికి వంత పాడుతున్నారు. అంతా తామే చూసుకుంటామని భరోసా ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికై నా చెరువులు, కుంటలు, దారులు ఆక్రమణలకు గురికాకుండా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.
నాలాలు, వాగులను సైతం వదలని అక్రమార్కులు
దర్జాగా కబ్జా చేసి కంచెలు, ప్రహరీల నిర్మాణం
అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం