భాకరాపేట: ఎరవ్రారిపాలెం మండలం నెరబైలు – తలకోన మార్గంలో ఒంటరి ఏనుగు హల్చల్ చేస్తోంది. భక్తులు, వాహనదారులు, స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. వాహనదారుల పైకి ఒంటరి ఏనుగు దాడికి యత్నిస్తోంది. దీంతో భక్తులు, ప్రయాణికులు ప్రాణ భయంతో పరుగులు తీయాల్సి వస్తోంది. గత కొన్ని రోజులుగా నెరబైలు, చింతగుంట గ్రామ సమీపంలో తిరుగుతూ పంట పొలాలను ధ్వంసం చేస్తున్న ఒంటరి ఏనుగు రైతాంగానికి భారీ నష్టాన్ని చేకూర్చుతోంది. రాత్రి వేళల్లో ఆయా గ్రామాల సమీపానికి చేరుకుని స్థానికుల కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. పంటలను కాపాడుకోవడానికి రైతులు ప్రాణాలకు తెగించాల్సి వస్తోంది. కొందరు ప్రాణాలను పణంగా పెట్టి పొలాల్లోనే కాపలా కాయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఇంత జరుగుతున్నా అటవీశాఖ మొద్దు నిద్ర వీడనంటోంది. ఒంటరి ఏనుగును కట్టడి చేసి, రైతులకు అండగా నిలవాల్సిన అధికారులు తమకేమీ పట్టదన్నట్టు మిన్నకుండిపోవడం విమర్శలకు తావిస్తోంది.


