రేణిగుంట: రేణిగుంట రైల్వేస్టేషన్ పరిధిలో ఆగి ఉన్న రైళ్లలోప్లాట్ఫారాలపై బ్యాగ్ దొంగతనాలు చేస్తున్న వ్యక్తిని గురువారం రేణిగుంట జీఆర్పీ పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుంచి నాలుగు లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. స్టేషన్లో గురువారం జీఆర్పీ సీఐ యతీంద్ర విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. ఇటీవల రైళ్లలో దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో డీఎస్ఆర్పీ ప్రమోద్ ఆదేశాల మేరకు ఎస్ఐ మధుసూదన్ రావు సిబ్బందితో రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. రైళ్లలో దొంగతనం చేసే వ్యక్తి రేణిగుంట రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం– 1 పై ఉండగా అరెస్ట్ చేశామని తెలిపారు. అతను అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన రంగారెడ్డి కుమారుడు రమేష్రెడ్డి (33)గా గుర్తించినట్టు వెల్లడించారు. విచారణలో నిందితుడు తెలిపిన వివరాల ప్రకారం, ఉన్నత విద్యను అభ్యసించి, ఇంజినీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్వేర్గా పనిచేస్తున్న వ్యక్తి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పెట్టి తీవ్రంగా నష్టపోయినట్టు తేలిందన్నారు. ఆ తర్వాత చెడు వ్యసనాలకు అలవాటు పడి, అప్పులు పెరగడంతో సులభంగా డబ్బు సంపాధించాలనే ఉద్దేశంలో ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్టు గుర్తించామన్నారు. ఇతనిపై గుంతకల్ రైల్వే పోలీస్ స్టేషన్లో 8 కేసులు, గుత్తి రైల్వే పోలీస్ స్టేషన్లో ఒక కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ పై బయటికి వచ్చాడని తెలిపారు. నిందితుడి వద్ద నుంచి మొత్తం 36 గ్రాముల బంగారం, ల్యాప్టాప్, డిజిటల్ కెమెరాను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. సమావేశంలో ఐపీఎఫ్లు నవీన్, వెంకటేశులు పాల్గొన్నారు.


