తిరుపతి కల్చరల్:టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్వీ సంగీత, నృత్య కళాశా ల, ఎస్వీ నాదస్వర, డోలు పాఠశాలలో 2026, 2027 విద్యా సంవత్సరానికి పలు రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరకాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 2 నుంచి కళాశాలలో దరఖాస్తులు జారీ చేయనున్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈనెల 30వ తేదీ వరకు స్వీకరించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు కళాశాల కార్యాలయ పనివేళల్లో రూ.50 చెల్లించి దరకాస్తు పొందవచ్చు. రెగ్యులర్ కోర్సులకు 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. రెగ్యులర్ కోర్సు చదివే విద్యార్థులకు మాత్రమే నిబంధనలకు లోబడి హాస్టల్ వసతి కల్పించనున్నట్టు తెలిపింది. మరిన్ని వివరాలకు 0877–22697, 9848374408, 9440793205ను సంప్రదించాలని టీటీడీ సూచించింది.
కల్వర్టును ఢీకొన్న కారు
– ఒకరికి తీవ్ర గాయాలు
చంద్రగిరి: అదుపుతప్పి కల్వర్టును కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల మేరకు. తిరుపతి నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న కారు నడింపల్లి వద్ద అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులోని బాబ్జీకి తీవ్ర గాయాలు కాగా వెంకట రవికుమార్, కృష్ణారెడ్డికి స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించారు.
టోల్గేట్.. తప్పని నిరీక్షణ
ఏర్పేడు:తిరుపతి–శ్రీకాళహస్తి మార్గం, ఏర్పేడు మండలం, మేర్లపాక సమీపంలో ని టోల్గేటు వద్ద నిత్యం వాహనాలు బారులుతీరి నిలిచిపోతున్నాయి. టోల్ప్లాజ్ వద్ద వాహనాల ఫాస్టాగ్ స్కానింగ్ ఆలస్యం చేస్తుండడంతో వాహనాలు బారులుతీరుతున్నాయి. ఇక్కడ నిత్యం ఇదే తంతు. సిబ్బంది కూడా వాహనదారులతో తరచూ ఘర్షణకు దిగుతూ వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్న సంఘటనలు గతంలో పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాయి. ఉన్నతాధికారులు పర్యవేక్షించి, సంబంధిత కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని వాహనచోదకులు కోరుతున్నారు.
నేటి నుంచి పోలీస్ యాక్ట్ అమలు
తిరుపతి క్రైం : శాంతి భద్రతల పరిరక్షణ, అవాంఛనీయ ఘటనల నివారణ నిమిత్తం జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ సెక్షన్–30 అమలు చేస్తున్నట్లు సబ్–డివిజనల్ పోలీస్ అధికారులు తెలిపారు. ఆదివారం వారు మాట్లాడుతూ తిరుమల, తిరుపతికి శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో ప్రజల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభలు, ఇతర సామూహిక కార్యక్రమాలకు పోలీసు అనుమతి తప్పనిసరని వివరించారు. పోలీస్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే వివాహాలు, అంత్యక్రియలు, సంప్రదాయ కుటుంబ కార్యక్రమాలకు ఈ ఉత్తర్వులు వర్తించవని తెలిపారు.


