● గ్యాస్ రాయితీ కట్ : జిల్లాలో 5.60లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అయితే ఇందులో 25శాతం మందికి రాయితీతో ఇచ్చే 3 సిలెండర్లు గ్యాస్ అందలేదు. ప్రశ్నిస్తే ఈకేవైసీ చేయించుకోలేదని చెబుతున్నారు..
● ఉపాధి కూలీలకు కోత : జిల్లా వ్యాప్తంగా 11.50లక్షల మందికి పైగా జాబ్ కార్డులు ఉన్నాయి. ఈకేవైసీ లేదంటూ 30శాతం మందికి పనులు కట్ చేశారు.
● ప‘రేషన్’ : జిల్లాలో 6.05లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. గత వైఎస్సార్సీపీ పాలనలో బియ్యం, చక్కెర, కందిపప్పు, నూనెతోపాటు 12 రకాల సరుకులు ఇచ్చేవారు. అయితే చంద్రబాబు పాలనలో బియ్యంతో సరిపెట్టేస్తున్నారు. పైగా 60 వేలమందికి ఈకేవైసీ లేదని సరుకులు నిలిపేసేందుకు యత్నిస్తున్నారు.
● తల్లికి తప్పని తంటాలు : తల్లికి వందనం పథకానికి ఆధార్ లింక్తోపాటు ఈకేవైసీ లేదంటూ గత ఏడాది వందలాదిమందికి నగదు జమ చేయలేదు. ఈ ఏడాదైనా పథకాన్ని పొందడానికి ముందుగానే ఆధార్ను బ్యాంక్తో లింకేజ్ చేసుకోవడంతోపాటు ఈకేవైసీ చేయించుకోవాలని పలువురు సూచిస్తున్నారు.
ఈకేవైసీ పేరుతో లబ్ధిదారులను
తగ్గిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
60వేల మందికి ‘సుఖీభవ’ దూరం
55 వేల మందికి రేషన్ ప్రశ్నార్థకం
వందలాది మందికి దొరకని ‘వందనం’
తిరుపతి అర్బన్ : ఈకేవైసీ లేదంటూ జిల్లాలో 60వేల మందికిపైగా రైతులకు అన్నదాతా సుభీభవ పథకం వర్తించలేదు. మొత్తం 2,12,004 మందిని సుఖీభవ పథకానికి అర్హులుగా గుర్తించారు. అయితే 1,54,908 మందికి మాత్రమే నగదు జమ చేశారు. 57,096 మంది రైతులు ఈకేవైసీ చేయించుకోలేదని మొండిచేయి చూపారు. దీంతో రైతులు పెట్టుబడి సాయం కోసం అప్పులు చేసుకోవాల్సిన దుస్థితి దాపురించింది.
సూపర్ సిక్స్ అంటూ చంద్రబాబు ప్రభుత్వం తూతూమంత్రంగా పథకాలను అమలు చేస్తోంది. రెండేళ్లలో అరకొరగానే లబ్ధిదారులకు విదిలిస్తోంది. ప్రధానంగా ఈకేవైసీ పేరుతో పేదలకు సక్రమంగా సంక్షేమం అందకుండా కోతలు పెడుతోంది. ఆదమరచిన వారిని ఏకంగా జాబితా నుంచి తొలగించేస్తోంది. ఏళ్ల తరబడి పథకాలు పొందిన వారికి సైతం రిక్తహస్తం చూపిస్తోంది.