తిరుపతి క్రైమ్ : మాదక ద్రవ్యాల రవాణా, విక్రయం, వినియోగంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ఈగల్ టీమ్ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో శనివారంతిరుపతి రైల్వే స్టేషన్, బస్స్టాండ్, పార్శిల్ కార్యాలయాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వస్తువులు, పార్శిళ్లు, సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీసు అధికారులు మాట్లాడుతూ చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు నిరంతరం చర్యలు చేపడుతున్నామని తెలిపారు. యువత మత్తు బారిన పడకుండా కాపాడడం ప్రధాన బాధ్యతగా భావిస్తున్నామని వెల్లడించారు. ప్రజల సహకారంతో మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే జిల్లావ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని వివరించారు.


