తిరుపతి తుడా: వైద్య వృత్తి దైవంతో సమానమని, సేవాభావంతో కొనసాగించాలని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ పిలుపునిచ్చారు. స్విమ్స్లో పీజీ వైద్య విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రొగ్రామ్ను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ వివిధ కళాశాలల్లో యూజీ, పీజీ విద్యనభ్యసించి భగవంతుని స్వరూపమైన టీటీడీ దేవస్థానం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్విమ్స్ హాస్పిటల్ నుంచి వైద్య వృత్తిలోకి ప్రవేశించడం అదృష్టమన్నారు. సేవభావంతో వైద్య సేవలు అందించాలని సూచించారు. చికిత్స చేసి ప్రాణంకాపాడే దేవుడుగా డాక్టర్లను నమ్ముతారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని పేర్కొన్నారు. డీన్ డాక్టర్ అలోక్ సచన్, రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్ బిట్లా, మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ అల్లాడిమోహన్, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ నాగరాజ్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ముక్తీశ్వరయ్య, కమ్యూనిటీ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్, డిప్యూటీ రిజిస్ట్రార్ డాక్టర్ యర్రమరెడ్డి, డాక్టర్ రామ్, వైద్యాధికారులు పాల్గొన్నారు.


