తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో గత ఏడాది నవంబర్లో జరిగిన డీపీఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ కోర్సులకు సంబంధించిన మూడవ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేసినట్లు డీన్ ప్రొఫెసర్ సురేంద్రబాబు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ రాజామాణిక్యం తెలిపారు. ఫలితాల కోసం విద్యార్థులు వర్సిటీ వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు.
రుణాలు మంజూరు చేయండి
తిరుపతి అర్బన్: స్వయం సహాయక సంఘాలకు సకాలంలో రుణాలు మంజూరు చేయాలని జాయింట్ కలెక్టర్ గోవిందరావు ఆదేశించారు. శుక్రవారం ఆయన బ్యాంకర్లతో కలెక్టరేట్లో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ విద్యకు సంబంధించిన రుణాల విషయంలో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రుణాల మంజూరు శాతం పెంచాలన్నారు. అలాగే పీఎంఈజీసీ పథకం రుణాలు మంజూరైన యూనిట్లు అన్ని గ్రౌండింగ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్బీఐ ఎల్డీఓ రవీంద్రబాబు, నాబార్డ్ డీడీఎం చంద్రశేఖర్, ఎల్డీఎం రవికుమార్, యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ సామంచి శర్మ తదితరులు పాల్గొన్నారు.
సప్లిమెంటరీకి 93.76 శాతం మంది హాజరు
తిరుపతి సిటీ: జిల్లాలో గత ఏడు రోజులగా జరుగుతున్న ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 52 పరీక్షా కేంద్రాలలో శుక్రవారం ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరిగిన ఫిజిక్స్ పేపర్–1 పరీక్షకు 1,3426 మందికి గాను 93.76శాతంతో 12,589 మంది విద్యార్థులు హాజరైనట్లు ఆర్ఐఓ జీ.రాజశేఖర్రెడ్డి తెలిపారు. అలాగే మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు జరిగిన సెకండ్ ఇయర్ కామర్స్, సోషియాలజీ పరీక్షకు 962 మందికి గాను 832 మంది హాజరైనట్లు తెలిపారు.
చురుగ్గా విద్యుత్ పునరుద్ధరణ పనులు
తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో గురువారం రాత్రి బలమైన గాలలతో కూడిన వర్షం కారణంగా పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆయా గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేసినట్టు సీఎండీ శివశంకర్ లోతేటి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లాలోని కొండాపురం, మైదుకూరు, మైలవరం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు గ్రామీణ, దువ్వూరు, రాజుపాలెం, చాపాడు మండలాల్లోని 28 గ్రామాల్లోనూ, నెల్లూరు జిల్లాలోని కావలి గ్రామీణం, కొండాపురం, కోవూరు, ముత్తుకూరు, జలదంకి, దగదర్తి, అల్లూరు మండలాల్లోని 15 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని తెలిపారు. ఈ రెండు జిల్లాల్లో 26 ఫీడర్లు, 114 కి.మీ.మేరకు విద్యుత్ లైన్లు, 213 స్తంభాలు, 131 ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.
స్వచ్ఛ తిరుపతి పై
ప్రజాభిప్రాయ సేకరణ
తిరుపతి తుడా: స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ జాతీయ పోటీలలో సిటిజన్ ఫీడ్ బ్యాక్ ప్రక్రియ కొనసాగుతోంది. గడచిన పది రోజులుగా తిరుపతిలో అమలవుతున్న పరిశుభ్రత, చెత్త సేకరణ, పురపాలన, మరుగుదొడ్ల నిర్వహణ వంటి అంశాలతో కుడిన సేవల ఆధారంగా స్వచ్ఛ యాఫ్లో అభిప్రాయాలను నమోదు చేస్తున్నారు. తిరుపతి వ్యాప్తంగా అధికారులు అభిప్రాయ సేకరణలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా ప్రకాశం పార్కులో అధికారులు, సిబ్బంది వాకర్స్ నుంచి అభిప్రాయాలను నమోదు చేయించారు.


