జిల్లాలో రాయితీ పరికరాలు
కొట్టేసేందుకు టీడీపీ నేతల స్కెచ్
ఇప్పటికే అధికారులకు చేరిన సిఫార్సులు
లక్కీడిప్ పేరుతో తప్పించుకునేందుకు యంత్రాంగం సన్నద్ధం
తిరుపతి అర్బన్: సులభతరంగా వ్యవసాయం చేసుకునేందుకు ఏర్పాటు చేసిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం దారితప్పుతోంది. మండల స్థాయిలో పలుకబడి కలిగిన నేతలకు కల్పతరువుగా మారింది. ఎస్సీలకు 50 శాతం సబ్సిడీతో ట్రాక్టర్లు పంపిణీ చేయనుండడంతో వాటిని బినామీల పేరుతో దక్కించుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నట్టు తెలుస్తోంది. మిగిలిన యంత్ర పరికరాలను అదే రీతిలో తమ వారికే దక్కేలా ఏర్పాట్లు చేసినట్టు స్పష్టమవుతోంది. ఈ మేరకు సంబంధిత అధికారులు ఆ నియోజకవర్గ ముఖ్యనేతల ద్వారా సిఫార్సులు వెళ్లినట్టు సమాచారం. నిజమైన రైతుకు మొండిచేయే మిగలనున్నట్టు స్పష్టమవుతోంది.
పనిముట్లు తక్కువ..దరఖాస్తులెక్కువ
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో క్రమం తప్పకుండా ప్రతి ఏటా ట్రాక్టర్లు, వరికొత యంత్రాలతోపాటు 24 రకాల చిన్న చిన్న పనిముట్లను రాయితీతో అందించేవారు. అయితే చంద్రబాబు సర్కార్లో 9 రకాల పనిముట్లు మాత్రమే ఇవ్వడానికి దరఖాస్తులు ఆహ్వనించారు. జిల్లా వ్యాప్తంగా 853 యంత్రపరికరాలకు 2,781 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ట్రాక్టర్లు 28 యూనిట్లు మంజూరు చేశారు. దీంతో వాటికి డిమాండ్ పెరిగింది. ఏకంగా 812 మంది దరఖాస్తు చేసుకున్నారు. వరికొత యంత్రాలకు చెక్ పెట్టారు. మిగిలిన 8 రకాల పనిముట్లపై రైతులు పెద్దగా ఆసక్తి చూప లేదు.
ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రాయితీ
ఎస్సీ, ఎస్టీలకు 50శాతం రాయితీలో పనిముట్లు, ఇతర కులాల వారికి 40శాతం రాయితీతో ఇవ్వనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అయితే కొందరు పపచ్చ నేతలు రాయితీ ట్రాక్టర్లు బినామీ పేర్లతో కొట్టేసేందుకు స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది.
జిల్లా సమాచారం


