– శ్రీసిటీ ఎండీ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి
శ్రీసిటీ (వరదయ్యపాళెం): దివ్యాంగ యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు శ్రీసిటీలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తెలిపారు. విజయవాడలో ఈ నెల 25న నిర్వహించిన ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్–2026లో ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషనన్తో ఈ మేరకు శ్రీసిటీ ఎండీ అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేశారు. సీఎం చంద్రబాబు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. గ్రోత్ సమ్మిట్లో డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ శ్రీసిటీ ఎప్పుడూ సమగ్ర అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తోందన్నారు. దివ్యాంగ యువతకు వ్యవస్థాపక శిక్షణ, ఇతర నైపుణ్యాలు అందించడం ద్వారా వారికి స్వయం ఉపాధి మార్గాలను సృష్టించడమే కాకుండా, సామాజిక సమానత్వం, పారిశ్రామిక పురోగతిపై తమ కట్టుబాటును మరింత బలపరుస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ‘‘ఒక కుటుంబం – ఒక వ్యాపారవేత్త’’ లక్ష్యానికి అనుగుణంగా, ఆంధ్రప్రదేశ్లో కోటి మంది వ్యాపారవేత్తలను తయారు చేయాలనే సంకల్పానికి దివ్యాంగ యువత శిక్షణ కార్యక్రమం తోడ్పాటు అందించనుందని పేర్కొన్నారు. సీఎం మాట్లాడుతూ, దివ్యాంగ యువతకు వ్యవస్థాపక శిక్షణ అందించేందుకు శ్రీసిటీ చొరవ చూపడం అభినందనీయమన్నారు.


