తిరుపతి అర్బన్: సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీ) 2026–27కు ఖాళీగా ఉన్న పోస్టులను ఒప్పంద ప్రాఽతిపదికన భర్తీ చేయడానికి ఈ నెల 27 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ కేవీఎన్ కుమార్ తెలిపారు. దరఖాస్తు గడువు జూన్ 5వ తేదీ వరకు మాత్రమే ఉంటుందని చెప్పారు. జూన్ 9న సర్టిఫికెట్ల పరిశీలన, జూన్ 16న మెరిట్ జాబితా విడుదల, జూన్ 18న నియామక ఉత్తర్వులు, జూన్ 20 విధుల్లో చేరిక ఉంటుందన్నారు. కేజీబీవీఆర్ఈసీఆర్యుఐటీఎంఈఎన్టీ .ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ వెబ్సైట్ ద్వారా ఆసక్తి ఉన్న బీఈడీ, పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. కనిష వయస్సు 18 ఏళ్లు, గరిష్ట వయస్సు 45 ఏళ్లుగా వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్లకు మరో ఐదేళ్లు వయస్సు(50) సడలింపు ఉందని పేర్కొన్నారు. దివ్యాంగులకు 52 ఏళ్ల వరకు అర్హులుగా చెప్పారు. ప్రతి అభ్యర్థి రూ.300 అప్లికేషన్ ఫీజు చెల్లించాలని స్పష్టం చేశారు. టెట్ అర్హత తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. అయితే పీఈటీ, కొన్ని వృత్తి విద్యా పోస్టులకు టెట్ అవసరం లేదని తెలిపారు. జిల్లాలో 9 కేజీబీవీల్లోను 13 పోస్టులను భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు.
వడదెబ్బకు వృద్ధురాలి మృతి
నాగలాపురం: పిచ్చాటూరు మండలం నీరువాయి గ్రామంలో వడదెబ్బ కారణంగా కృష్ణమ్మ మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు కథనం మేరకు.. నీరువాయి గ్రామానికి చెందిన కృష్ణమ్మ (74) ఆదివారం ఎండ తీవ్రత తట్టుకోలేక అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ప్రథమ చికిత్స అందించి, ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికి మార్గం మధ్యలోనే మృతి చెందినట్లు తెలిపారు.
విద్యుత్శాఖ జూనియర్ లైన్మన్ మృతి
వరదయ్యపాళెం: మండలంలోని కాంబాకం సచివాలయ పరిధిలో జూనియర్ లైన్మన్గా విధులు నిర్వహిస్తున్న ఏ.రాజశేఖర్ (26) ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో బీజీఆర్కాలనీ సమీపంలో విద్యుత్ లైన్ పాడైపోవడంతో దాన్ని మరమ్మతు చేస్తేందుకు విద్యుత్ స్తంభం ఎక్కిన రాజశేఖర్ విద్యుత్ షాక్కు గురై, కింద పడ్డాడు. సమాచారం అందుకున్న స్థానికులు, విద్యుత్ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రాజశేఖర్ను చికిత్స నిమిత్తం సత్యవేడుకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు.


