తిరుపతి అన్నమయ్యసర్కిల్: కూటమి పాలనలో నిర్వహించిన మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగ నియామకాల్లో శాప్ చైర్మన్ రవినాయుడు సుమారు రూ.50 కోట్ల మేర అక్రమార్జనకు పాల్పడ్డారని వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఇమ్రాన్ బాషా ఆరోపించారు. యూనివర్సిటీలో టీ తాగడానికి టికానా లేని ఆయన నేడు రూ.కోట్ల ఆస్తులకు అధిపతి ఎలా అయ్యారని ప్రశ్నించారు. సోమవా రం సాయంత్రం ఆయన తిరుపతి ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం క్రీడా విధానాన్ని ప్రోత్సహిస్తున్నామంటూ ఇందులో భాగంగా 3 శాతం స్పోర్ట్స్ కోటా కింద మెగా డీఎస్సీలో 421 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టారన్నారు. స్పోర్ట్స్ కోటాను దుర్వినియోగం చేస్తూ డీఎస్సీ నియామకాల్లో ఒక్కొక్క పోస్టుకు సుమారు రూ.15 లక్షల చొప్పున 300 మంది అనర్హులకు కట్టబెట్టి అక్రమ వసూళ్లకు పాల్పడంటూ ఆరోపించారు. ఇందుకు సంబంధించి బేరసారాల మాటల వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయాన్ని గుర్తుచేశారు. అక్రమ వసూళ్ల దందాను సంబంధింత శాఖ ముఖ్య అధికారి నడిపించాడనే ప్రచారం ఉందన్నారు. ఈ వ్యవహారాలపై కొందరు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినా సీఎం చంద్రబాబు ఏమాత్రం స్పందించక పోవడం సందేహాలకు తావిస్తోందన్నారు. నగర యువజన విభాగం అధ్యక్షుడు లక్కాకుల దినేష్ రాయల్ మాట్లాడుతూ చంద్రగిరి ప్రాంతానికి చెందిన రవినాయుడు తిరుపతిలో పెత్తనం సాగిస్తూ తెలుగుదేశం పార్టీలోని సీనియర్ నాయకుల మధ్య చీలికలు తెస్తున్నారని ఆరోపించారు. యువజన విభాగం నగర ఉపాధ్యక్షుడు మోహన్ రాజ్ మాట్లాడుతూ తిరుపతిలో భూకబ్జాలకు పాల్పడుతూ అక్రమ దందాలకు పాల్పడుతున్న రవినాయుడిని నగర బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు తలారీ జీవన్, శరత్యాదవ్, వెంకటకిరణ్, భరత్, రోహిత్ ఆచారి పాల్గొన్నారు.


