ఈదురుగాలులకు కూలిపోయిన చెట్లు తెగుళ్ల కారణంగా నాణ్యత లేని కాయలు కొనేందుకు ముందుకు రాని వ్యాపారులు దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్న రైతులు
నిమ్మ రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. పడిలేచే ధరలతో దిక్కుతోచని దుస్థితి దాపురించింది. అరకొర దిగుబడి వచ్చినప్పుడు అంతా ఆశాజనకంగా ఉంటోంది. చెట్టు నిండా కాయలు వస్తే మాత్రం రేటు ఒక్కసారిగా తగ్గిపోయి నిరాశే మిగులుతోంది. దీనికితోడు ఈదురుగాలుల కారణంగా పలు తోటల్లో చెట్లు నేలకొరిగాయి. ఇదే అదునుగా విజృంభించిన తెగుళ్లు కాయల నాణ్యతపై ప్రభావం చూపాయి. ఈ క్రమంలోనే ఇటీవల వరకు కేజీ నిమ్మ రూ.200 వరకు పెరిగింది. కోతలు పూర్తి చేసుకుని మార్కెట్కు వచ్చేసరికి కేజీ రూ.20కి పడిపోయింది.
సైదాపురం : ప్రస్తుతం మార్కెట్లో నిమ్మ ధరలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈనెల మొదటి వారంలో కేజీ రూ.100 నుంచి రూ.200 వరకు ధర పలికింది. అయితే ప్రస్తుతం రూ.20కి కూడా కొనేవాళ్లు లేకపోవడంతో నిమ్మ రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల పెనుగాలులు వీయడంతో కొన్ని ప్రాంతాల్లో నిమ్మతోటలు దారుణంగా దెబ్బతిన్నాయి. దీనికి తోడు తెగుళ్లు సైతం నిమ్మ రైతులను నిలువునా ముంచేశాయి.
నష్టాల బాటలోనే..
ఈ ఏడాది నిమ్మ రైతులకు నష్టాలు తప్పేలా లేవు. తెగుళ్ల కారణంగా కాయల నాణ్యత దెబ్బతింది. దీంతో వ్యాపారులు కొనేందుకు ముందుకు రావడంలేదు. మార్కెట్కు కాయలను తీసుకెళ్లినా అరకొర రేట్లకే అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో పెట్టుబడి కూడా వచ్చేలా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒక్కసారిగా పడిపోయిన నిమ్మ ధరలు


