శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నిర్వహించే రాహు–కేతు పూజల పేరిట భక్తులను కొందరు దళారులు నిలువునా దోచుకుంటున్నారు. ఆలయ పరిసరలు, సమీపంలోని చిన్న దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరిపిస్తామని రూ.వేలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి. అనంతరం నాగశిలలు, పూజా సామగ్రిని ఎక్కడపడితే అక్కడ వదిలివెళ్లిపోతున్నారని పలువురు మండిపడుతున్నారు. గతంలో భరద్వాజ తీర్థం వద్ద నాగశిలలను వదిలేవారు. అక్కడ భద్రత కట్టుదిట్టం చేయడంతో ప్రస్తుతం ఆలయ సమీప ప్రాంతాల్లో పడేస్తున్నారని పట్టణవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై భక్తుల్లో అవగాహన కల్పించడంలో పాలకమండలి, అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైల్వే స్టేషన్, బస్టాండ్, ఆలయ పరిసరాల్లో స్పష్టమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పట్టణ వాసులు కోరుతున్నారు. ఈ విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు.


