కార్వేటినగరం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరినీ కలుపుకుని పనిచేద్దామని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి, మాజీ ఎంపీ మహాసముద్రం జ్ఞానేంద్రరెడ్డి, జీడీనెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మహా సముద్రం దయాసాగర్రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు వల్లివేడు పృథ్వీరెడ్డి, పెనుమూరు మండల నాయకులు ఆదివారం మాజీ మంత్రి పెద్దిరెడ్డిని తిరుపతిలోని వారి స్వగృహంలో కలిశారు. ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో పార్టీ విజయానికి పనిచేసిన కార్యకర్తలు, నాయకులను కలుపుకుని వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లి ఎండగట్టాలన్నారు. అదే విధంగా గ్రామ స్థాయిలో నూతనంగా నియామకాలు చేపట్టిన కమిటీ సభ్యులకు స్థానిక ఎన్నికలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద దొంగ ఓట్లకు తావు లేకుండా అప్రమత్తంగా ఉండేలా చూడాలని తెలిపారు. కూటమి నాయకుల ఎత్తులను తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉండేలా వారికి అవగాహన కల్పించాలన్నారు.


