తిరుపతి అన్నమయ్యసర్కిల్ : తిరుమలలో సామాన్య భక్తులకే ప్రాధాన్యమిస్తున్నట్లు టీటీడీ అదనపు ఈఓ వెంకయ్యచౌదరి తెలిపారు. ఆదివారం తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్లో సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్ కౌంటర్లను జేఈఓ శరత్తో కలిసి పరిశీలించారు. అదనపు ఈఓ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శ్రీవారి దర్శనం, అన్నప్రసాదం, తాగునీరు, భద్రత తదితర సేవలను సమర్థవంతంగా అందిస్తున్నామన్నారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణునివాసంలో పకడ్బందీగా సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం ఆ ప్రాంతాల్లో నాణ్యమైన మౌలిక వసతులు కల్పించామని వెల్లడించారు. ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ భక్తులను తప్పుదోవ పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణునివాసం వద్ద కొందరు ఆటో డ్రైవర్లపై ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఇప్పటికే వారికి కౌన్సెలింగ్ ఇచ్చామని, అవసరమైతే ఆటోలను సీజ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని స్పష్టం చేశారు. సీవీఎస్ఓ మురళీకృష్ణ మాట్లాడుతూ సోషల్ మీడియా ప్రచారాలను నమ్మవద్దని, టీటీడీ అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని, మోసపూరిత చర్యలపై విజిలెన్స్కు సమాచారం అందించాలని కోరారు. అనంతరం శ్రీనివాసం, విష్ణు నివాసం వద్ద సర్వదర్శనం కౌంటర్లను పరిశీలించారు. టీటీడీ సీఈ సత్యనారాయణ పాల్గొన్నారు.


