చిత్తూరు కలెక్టరేట్ : ఎన్సీసీ కేడెట్లు థల్ సైనిక్ క్యాంపునకు ఎంపికై నట్టు కల్నల్ నోయిల్ వివేక్ మోనిష్ తెలిపారు. జిల్లా కేంద్రమైన చిత్తూరులోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం వార్షిక శిక్షణా శిబిరంలో భాగంగా విద్యార్థులకు లెఫ్టినెంట్ కల్నల్ లోకనాథన్ ఆధ్వర్యంలో ఫైర్, ఫైటింగ్పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో చెలరేగే అగ్నిజ్వాలలను ఎలా నివారించాలి, ఇంధన లీకేజీలను ఎలా అరికట్టాలనే అంశాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. తుపాకులతో గురిచూసి కాల్చడం, క్లిష్టమైన అడ్డంకులను అధిగమించే జిగ్ జాగ్ రన్నింగ్పై శిక్షణ ఇచ్చినట్టు పేర్కొన్నారు. అలాగే త్వరలో ఢిల్లీలో నిర్వహించే ప్రతిష్టాత్మక థల్ సైనిక్ క్యాంపునకు కేడెట్లను ఎంపిక చేసినట్లు చెప్పారు. కేడెట్లలో సాహసం, సైనిక నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణను పెంపొందించడమే క్యాంపు ముఖ్య ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో ఎన్సీసీ అధికారులు ప్రసాద్రెడ్డి, కార్తీక్, బాలాజీ, హేమంత్, అరుణ్ పాండ్యన్ తదితరులు పాల్గొన్నారు.


