నాగలాపురం: మండలంలోని కారణి సమీపంలో ఉన్న దాబాలో పార్కింగ్ చేసిన గ్యాస్ ట్యాంకర్లో డ్రైవర్ మృతి చెందిన ఘటన శనివారం ఉదయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లో కెళితే అనంతపురం నుండి గుమ్మిడిపూండికి వెళ్తున్న గ్యాస్ ట్యాంకర్ లారీ డ్రైవర్ శుక్రవారం రాత్రి కారణి సమీపంలో ఉన్న దాబాలో పార్కింగ్ చేసి వాహనంలోనే నిద్రపోయాడు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో డ్రైవర్ ఎంత లేపినా స్పందించకపోవడంతో దాబా నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే 108 అంబులెన్సు పిలిపించారు. అంబులెన్స్ సిబ్బంది పరిశీలించగా డ్రైవర్ మద్యం సేవించలేదని, నిద్రలోనే మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. లారీలో ఉన్న డ్రైవింగ్ లైసెన్సు ఆధారంగా మృతుడిని తమిళనాడు నామక్కల్కు చెందిన శరవణన్(53)గా గుర్తించారు. మృతుడి బంధువులకు సమాచారం అందించినట్లు, అంతవరకు మృతదేహాన్ని సత్యవేడు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచనున్నట్లు ఎస్ఐ సునీల్ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.


