వరదయ్యపాళెం: రాష్ట్రంలో రోజురోజుకు మితిమీరుతున్న టీడీపీ నాయకుల ఆగడాలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వైఎస్సార్సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ తెలిపారు. సోమవారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రాయచోటి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, వైఎస్సార్ సీపీ నాయకులు దశరథరామిరెడ్డిని ఆయన పరామర్శించి, యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నూకతోటి మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు రోజువారీ రాష్ట్రంలో జరుగుతూనే ఉన్నాయని, ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి ఘటనలు మంచిది కాదని హితవు పలికారు. ఇలాంటి అఘాయిత్యాలను నియంత్రించాల్సిన పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరించి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని దుయ్యబట్టారు. నీచ సంస్కృతిని వీడనాడి రాష్ట్రంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని సూచించారు. ఈ సందర్భంగా దశరథరామిరెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బీరేంద్ర వర్మ, నాయకులు భానుప్రకాష్ రెడ్డి, కోడూరు బాబురెడ్డిలు ఉన్నారు.


