తిరుమల: ఏపీ హైకోర్టు న్యాయమూర్తి సుబేందు సమంతా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకటేష్ నాయక్ శనివారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయాధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ అధికారులు లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు. అలాగే సినీ దర్శకుడు సముద్రఖని, దర్శకుడు మొహర్ రమేష్ కూడా తిరుమలేశుని దర్శించుకున్నారు.
ఈకేవైసీ చేయించుకోండి
తిరుపతి అర్బన్: రేషన్కార్డు ఉన్న వారు తప్పకుండా ఈకేవైసీ చేయించుకోవాలని జిల్లా ఫౌరసరఫరాల శాఖాధికారి శేషాచలం రాజు శనివారం తెలిపారు. కార్డులో ఉన్న సభ్యులందరూ ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉందన్నారు. మీ రేషన్కార్డు, ఆధార్కార్డును రేషన్ డీలర్ లేదా సచివాలయం వద్దకు వెళితే మీ వేలిముద్రలు తీసుకుంటారని వెల్లడించారు. దీంతో ఈకేవైసీ పూర్తి అవుతుందన్నారు. జిల్లాలో 6 లక్షల రేషన్కార్డులున్నాయని, సుమారుగా 17 లక్షల మంది సభ్యులున్నారని పేర్కొన్నారు. అయితే 68 వేల మంది సభ్యుల ఈకేవైసీ పెండింగ్ ఉన్నట్లు చూపుతుందని చెప్పారు. వారు తప్పకుండా చేయించుకోవాలని సూచించారు. అయితే 5ఏళ్ల లోపు ఉన్న పిల్లలకు ఈకేవైసీ అవసరం లేదని స్పష్టం చేశారు.


