నాగలాపురం: మండల కేంద్రంలోని శ్రీదేవి, భూదేవి సమేత వేదనారాయణ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు శనివారం ఉదయం పద్మసరస్సులో చక్రస్నానం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగిశాయి. ఆలయ ప్రధాన అర్చకులు నాగరాజు భట్టాచార్యులు వేకువ జామున ఆలయాన్ని శుద్ధి చేసి, నిత్య కై ంకర్యాలు పూర్తి చేశారు. 6.30 గంటలకు స్వామివారిని పల్లకిలో కొలువుదీర్చి, గ్రామోత్సవం నిర్వహించారు. పల్లికి సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత వేదనారాయణ స్వామి వారికి స్నపన తిరుమంజనం చేశారు. 10.45 గంటలకు కోనేటిలో జలాలకు సంప్రోక్షణ చేసి, చక్రస్నానం నిర్వహించారు. అదే సమయంలో భక్తులు కోనేటిలో స్నాన మరిచారు. తరువాత ఉత్సవర్లకు ఆస్థానం జరిపారు. సాయంత్రం 7 గంటలకు విశ్వక్సేనుడితో కలిసి స్వామి వారిని మాడ వీధుల్లో ఊరేగించారు. రాత్రి ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగిశాయి. సూపరింటెండెంట్ శ్రీనివాసులు రెడ్డి, ఆలయాధికారులు శ్రీనివాసులు, చెంగల్ రాయులు, ఉదయ్ కుమార్, అర్చకులు దేవరాజ్ భట్టాచార్యులు పాల్గొన్నారు.


