నాగలాపురం: మండల కేంద్రంలోని వేదనారాయణ స్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు శుక్రవారం ఉదయం రథోత్సవం వైభవంగా నిర్వహించారు. రాత్రి స్వామివారు అశ్వ వాహనంపై విహరించారు. ఆలయ ప్రధాన అర్చకులు నాగరాజు భట్టాచార్యులు వేకువ జామున ఆలయ శుద్ధి, నిత్య కై ంకర్యాలు పూర్తి చేశారు. 6.30 గంటలకు స్వామివారిని రథంలో కొలువుదీర్చి గోవింద నామ స్మరణల నడుమ కోలాహలంగా రథోత్సవం జరిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని రథాన్ని లాగారు. ఉదయం 10 గంటలకు ఆలయానికి చేరుకున్న వేదనారాయణుడికి ఆలయ ప్రాంగణలో స్నపన తిరుమంజనం చేశారు. సాయంత్రం 4.30 గంటలకు రాములవారి మండపంలో శ్రీదేవి భూదేవి సమేత వేదనారాయణ స్వామి ఉత్సవమూర్తులకు విశేషాలంకరణ చేసి, వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ఆర్జిత కళ్యాణోత్సవం జరిపారు. రాత్రి 8 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తులను అశ్వ వాహనంపై కొలువుదీర్చి మంగళ వాయిద్యాలు, కోలాటాలు, కేరళ వాయిద్యాలు, పండరి భజనల నడుమ వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ నాగరత్న, సూపరింటెండెంట్ ఽశ్రీనివాసులు రెడ్డి, ఆలయాధికారులు శ్రీనివాసులు, చెంగల్ రాయులు, ఉదయ్ కుమార్, అర్చకులు దేవరాజ్ భట్టాచార్యులు పాల్గొన్నారు.


