దొరవారిసత్రం: మావిళ్లపాడు సమీపంలోని ఓ దాబా వద్ద జాతీయ రహదారికి పక్కనే గుర్తుతెలియని సుమారు 40 ఏళ్ల వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం రాత్రి చోటు చేసుకోగా శుక్రవారం వెలుగు చూసింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గురువారం రాత్రి పూటుగా మద్యం సేవించి డాబా వద్దకు బైక్పై వచ్చి మద్యం మత్తులో పడిపోయాడు. అక్కడ ఉన్న దాబాకు చెందిన వారు నీళ్లు తాగించి పంపారు. శుక్రవారం ఉదయం చూసేసరికి దాబాకు 100 మీటర్లు దూరంలో బైకు ఒక పక్క, ఒంటిపై దుస్తులు లేకుండా కేవలం డ్రాయిర్తో పడిపోయి మృతి చెందడంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పూటుగా మద్యం తాగిన అతను పడిపోవడంతో తాగేందుకు నీళ్లు లేక గొంతు ఎండిపోయి మృతి చెంది ఉండవచ్చని స్థానిక పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎస్ఐ చౌదరి ఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం మృత దేహాన్ని పోస్టుమర్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


