తిరుపతి సిటీ: ఏర్పేడు ఐసర్ విద్యాసంస్థలో ఇటీవల నిర్వహించిన ఏఐ ఫర్ లైఫ్ హాకథాన్ కార్యక్రమంలో ఎస్వీయూకు చెందిన ఎంసీఏ ఫైనల్ ఇయర్ విద్యార్థులు రూపొందించి స్మార్ట్ అగ్రి ఏఐ ప్రాజెక్ట్కు ద్వితీయ స్థానం లభించింది. విజేతలకు నిర్వాహకులు రూ.5 వేల నగదు బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా ఆధునిక ఏఐ ఆధారిత అగ్రికల్చర్ ప్లాట్ ఫామ్ ప్రాజెక్టును ప్రొఫెసర్ కే విజయలక్ష్మి ఆధ్వర్యంలో రూపొందించిన విద్యార్థులు ఎస్ వంశీ, కే శ్రీనివాసులను గురువారం వీసీ టాటా నర్సింగరావు, రెక్టార్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతినాయుడు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జి అంజిబాబు, ప్రొఫెసర్ శ్రీదేవి పాల్గొన్నారు.
డిగ్రీ నాలుగో సెమిస్టర్ ఫలితాలు విడుదల
తిరుపతి సిటీ: శ్రీపద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల అటానమస్ హోదాలో డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను ప్రిన్సిపల్ డాక్టర్ టి నారాయణమ్మ గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ గతనెల 16 నుంచి 29వ తేదీ వరకు జరిగిన నాలుగో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను కేవలం ఆరు రోజుల్లో విడుదల చేయడం గర్వంగా ఉందన్నారు. ఈ ఫలితాల్లో 97 శాతం విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించారని, 13 విభాగాల్లో వంద శాతం ఫలితాలు సాధించామని చెప్పారు. ఫలితాలను త్వరగా విడుదల చేసేందుకు సహకరించిన ఎగ్జామినేషన్ సెక్షన్ బృందం, అధ్యాపకులను ఆమె ఈ సందర్భంగా అభినందిచారు. ఈ కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్న్స్ డాక్టర్ ఎ విద్యుల్లత, డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్న్స్ డాక్టర్ భద్రమణి, డాక్టర్ దివ్యవాణి, సూపరింటెండెంట్ శాంతి, నీలదాస్, సుధాకర్, చంద్రశేఖర్, లక్ష్మయ్య, సునీత, సరిత, శిరీష, శైలజ పాల్గొన్నారు.
టీటీడీ ట్రస్టులకు
రూ.20 లక్షల విరాళాలు
తిరుమల : టీటీడీ ట్రస్టులకు దాతలు రూ.20 లక్షలు విరాళం ఇచ్చారు. హైదరాబాద్కు చెందిన నవ్య మార్కెటింగ్ యాజమాన్యం టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించింది. అలాగే గుంటూరుకు చెందిన వెంకటకృష్ణచైతన్య టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు మరో రూ.10 లక్షలు విరాళం ఇచ్చారు. దాతల తరఫున విరాళాల డీడీలను టీటీడీ బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు బుధవారం శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికి అందజేశారు. దాతలకు వేదాశీర్వచనం అందించి, శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాలను అందజేసి సత్కరించారు.


