వరదయ్యపాళెం: మండలంలోని బత్తలవల్లంలో శ్మశాన స్థలాన్ని సైతం అధికార టీడీపీకి చెందిన గ్రావెల్ మాఫియా తవ్వేస్తున్నారని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పరిధిలో చెదులుపాకం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 156/1లో ఉన్న శ్మశాన స్థలాన్ని, శ్మశానానికి వెళ్లే దారిని సైతం గ్రావెల్ మట్టి కోసం జేసీబీలతో తవ్వి తమిళనాడుకు తరలిస్తున్నట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై గ్రామస్తులు సోమవారం వరదయ్యపాళెం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. అదే చెదులుపాకం రెవెన్యూలో 156/2లో గల 5.44 ఎకరాల కుంట పొరంబోకు భూములను సైతం దర్జాగా తవ్వి గ్రావెల్ తరలిస్తున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్న శ్మశాన స్థలాన్ని పరిశీలించారు. అక్రమార్కులపై చర్యలు తీసుకుని శ్మశాన స్థలంలో గ్రావెల్ తవ్వకాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు తహసీల్దార్ హామీ ఇచ్చారు.


