నాగలాపురం: మండలంలోని శ్రీదేవి భూదేవి సమేత వేదనారాయణ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం మొదటి రోజు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. తొలుత ఆలయ మాడ వీధుల్లో విశ్వక్సేన, చక్ర చక్రత్తాళ్వార్, కొడి వస్త్రంతో ఉత్సవమూర్తులు ఊరేగింపు జరిగింది. తరువాత ఆలయంలో ధ్వజస్తంభానికి అభిషేకాలు చేశారు. వేద మంత్రాలు, మంగళవాయిద్యాలు నడుమ గరుడాళ్వార్ చిత్రపటాన్ని ధ్వజస్తంభం పైకి ఎగురవేశారు. దీంతో ఉత్సవాలు ప్రాంరంభమయ్యాయి. 12 గంటలకు స్వామివారికి స్నపన తిరుమంజనం చేశారు. సాయంత్రం ఊంజల్ సేవ నిర్వహించారు. రాత్రి 7 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తులను పెద్దశేష వాహనంపై కొలువుదీర్చి, గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి ఏకాంత సేవ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ నాగరత్న, సూపరింటెండెంట్ ధర్మయ్య, ఆలయాధికారి శ్రీనివాసులు, చెంగల్ రాయులు, ఉదయ్ కుమార్, పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.


