చంద్రగిరి: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో గురువారం నుంచి మే నెల 2వ తేదీ వరకు వసంతోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. ఇందులో భాగంగా 6 నుంచి 7.30 గంటల వరకు పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ, సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. వసంతోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు రూ.150 చెల్లించి ఉత్సవాల్లో పాల్గొనవచ్చునని తెలిపారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు అమ్మవారు స్వర్ణ రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారని పేర్కొన్నారు. వసంతోత్సాల్లో మూడు రోజుల పాటు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 వరకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. అదే విధంగా రాత్రి 7.30 నుంచి 8.30 వరకు అమ్మవారు నాలు గు మాడ వీధుల్లో ఊరేగుతారని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, అర్చకులు బాబుస్వామి తదితరులు పాల్గొన్నారు.


