తిరుపతి కల్చరల్:ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత తీర్చాలని సీపీఐ జాతీయ కమిటీ కంట్రోల్ మిషన్ చైర్మన్ కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. సోమవారం తిరుపతిలో సీపీఐ నేతలతో కలిసి వారు పెట్రోల్ బంకుల వద్ద నిరసన తెలిపారు. అంతకుముందు నగరంలోని వైఎస్సార్ విగ్రహం నుంచి తిలక్ రోడ్డులోని పెట్రోలు బంకు వరకు పెట్రోలు లేని ఆటో లాగుతూ వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత విపరీతంగా పెరిగిపోయి వాహనచోదకులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిన దుర్భర పరిస్థితి నెలకొందన్నారు. ఇంధన కొరత వస్తుందని తెలిసినప్పటికీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఇంధన సమస్యను అత్యవసర పరిస్థితిగా గుర్తించి, యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్య క్రమంలో సీపీఐ నేతలు హరినాథ్రెడ్డి, రామానాయు డు, మురళి, పెంచలయ్య, రాధాకృష్ణ, విశ్వనాథ్, చలపతి, శివారెడ్డి, ఎన్డీ.రవి, శ్రీరాములు పాల్గొన్నారు.


