రాపూరు: పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమైయ్యాయి. ఈ సందర్భంగా గోనుపల్లిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేత లక్ష్మీనరసింహుడు అత్తారింటి నుంచి కోనకు బయలుదేరి పెంచలకోనకు చేరుకున్నాడు. ఈ ప్రథమ ఊరేగింపుతో శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్లు ఆలయ ప్రధాన అర్చకులు పెంచలస్వామి,సీతారామయ్యస్వామి తెలిపారు. గోనుపల్లిలోని పెంచలస్వామి ఆలయంలో ఉన్న ఉత్సవమూర్తులను దేవాదాయ సిబ్బంది గిరిజనకాలనీకి తీసుకొచ్చారు. అక్కడ గిరిజనులు సంప్రదాయబద్ధంగా స్వామి, అమ్మవార్లకు ఆథిత్యం ఇచ్చి పూజలు చేశారు. అనంతరం గోనుపల్లి నుంచి ఉభయనాంచారులతో బయలుదేరిన లక్ష్మీనరసింహుడి పల్లకిని బోయలు కాళ్లకు పాదరక్షలులేకుండా మోసుకుంటూ కోనకు చేరుకున్నారు. అనంతరం పెంచలకోనలోని క్రేన్ మండపంలో మధ్యాహ్నం 12 గంటలకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.
బ్రహోత్సవాలకు అంకురార్పణ
పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వామికి సోమవారం రాత్రి బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో వైభవంగా ప్రారంభమయ్యాయి. రాత్రి 7 గంటలకు అనుజ్ఞ, వేదస్వస్తి, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం చేశారు. రాత్రి 9 గంటలకు స్వామివారి అలంకారమండపంలో వేదమంత్రోచ్ఛారణాల నడుమ అంకుర్పారణ కార్యక్రమం నిర్వహించారు.


