తిరుపతి మంగళం : జిల్లాలో కాంట్రాక్ట్ క్యారేజీ బస్సుల తనిఖీల్లో భాగంగా సోమవారం చైన్నె నుంచి జమ్మలమడుగు వైపు ప్రయాణిస్తున్న ఒక కాంట్రాక్ట్ క్యారేజీ బస్సును తనిఖీ చేయగా, ఆ వాహనం ఆల్ ఇండియా పర్మిట్కు సంబంధించిన పన్ను చెల్లించకుండా నడుపుతున్నట్లు రవాణాశాఖాధికారులు గుర్తించారు. దీంతో మోటారు వాహన తనిఖీ అధికారి అతికానాజ్ ఆ బస్సును స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనంపై పన్ను , పెనాల్టీ కలిపి మొత్తం రూ. 2,69 లక్షలు విధించారు. అలాగే భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళుతున్న మరో ట్రావెల్స్ బస్సు స్పీడ్ గవర్నర్ని ట్యాంపరింగ్ చేశారని గుర్తించి మోటరు వాహనాల తనిఖీ అధికారి ఆంజనేయ ప్రసాద్ స్వాధీనం చేసుకున్నారు. ఈ నెలలో ఇప్పటివరకు చైన్నె, బెంగళూరు, విజయవాడ, హైదరాబాదు తదితర ప్రధాన నగరాల నుంచి తిరుపతి మీదుగా ప్రయాణిస్తున్న సుమారు 1,750 బస్సులను తనిఖీ చేయగా వాటిలో 95 వాహనాలపై మోటారు వాహన చట్టం, సంబంధిత నియమ నిబంధనల ఉల్లంఘనలకు ఆ వాహనాలకు జరిమానాలు విధించారు. ఈ తనిఖీలలో రూ. 10 లక్షలకుపైగా పన్ను, అపరాధ రుసుములు వసూలు చేశామని జిల్లా రవాణాశాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్ తెలిపారు.


