తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడంలో అధికారులు, సిబ్బంది అలసత్వం వద్దు అని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి సూచించారు. ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీసులో సోమవారం డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వినియోగదారులు మాట్లాడుతూ వ్యవసాయ విద్యుత్ సర్వీసులను మంజూరు చేయడంలో జాప్యాన్ని సీఎండీ దృష్టికి తీసుకువచ్చారు. ఆ విషయంపై స్పందించిన సీఎండీ ఆయా సెక్షన్ల వారీగా వ్యవసాయ విద్యుత్ సర్వీసు దరఖాస్తుల సీనియారిటీ లిస్టును నోటీసు బోర్డులో ప్రదర్శించాలని, సీనియారిటీ ఆధారంగా సర్వీసులను మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ అంశంలో నిబంధనలను అతిక్రమిస్తే సంబంధిత అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంస్థ పరిధిలో జరిగే విద్యుత్ చౌర్యంపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం ద్వారా 55 మంది వినియోగదారులు విద్యుత్ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు పి.అయూబ్ఖాన్, కె. గురవయ్య, కె.రామమోహన్ రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు జె.రమణాదేవి, ఆర్.పద్మ, కె.ఆదిశేషయ్య, యం.మురళీకుమార్, సిహెచ్ రామచంద్రరావు, కె.సంపత్ కుమార్, ఎస్.రమణ, జనరల్ మేనేజర్లు విజయన్, జగదీష్, చక్రపాణి, భాస్కర్ రెడ్డి, లత, హరి తదితరులు పాల్గొన్నారు.


