తిరుపతి కల్చరల్: శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో ఆదివారం రాత్రి శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. రాత్రి బంగారు తిరుచ్చిపై శ్రీసీతారామలక్ష్మణులు, ప్రత్యేక తిరుచ్చిపై శ్రీఆంజనేయస్వామి వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ పాల్గొన్నారు.
కందిపప్పు ఇవ్వరా?
తిరుపతి అర్బన్ : చౌక దుకాణాలను సూపర్ మార్కెట్ తరహాలో అన్ని సరుకులు పంపిణీ చేస్తామంటూ ప్రభుత్వం ప్రగల్బాలు పలికి కేవలం బియ్యంతోనే సరిపెట్టేస్తున్నారు. అరకొర చక్కెర, గోధమపిండి మాత్రమే ఇస్తున్నారు. 20 నెలలుగా కందిపప్పు ఇవ్వలేదు. నూనె జాడే కనిపించలేదు. కందిపప్పు ధరలు పెరిగాయంటూ పూర్తిగా ఎగనామం పెట్టేశారు. జిల్లాలోని 1457 చౌకదుకాణాల పరిధిలో 6 లక్షల మంది కార్డుదారులుఅసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డీలర్లు మాత్రం వచ్చే నెల కందిపప్పు వస్తుందంటూ నెలలుగా ఊరడిస్తూ వస్తున్నారు.
విద్యుత్తుశాఖ తిరుపతి
డివిజన్లోకి కోడూరు
తిరుపతి రూరల్ : ఏపీఎస్పీడీసీఎల్ విద్యుత్తు శాఖ తిరుపతి టౌన్ డివిజన్ పరిధిలోనికి కోడూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలు విలీనం అయ్యాయని సీఎండీ కార్యాలయ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు తిరుపతి టౌన్ డివిజన్ పరిధిలో తిరుపతి నగరంతో పాటు తిరుపతి రూరల్ మండలంలో కొంత భాగం, రేణిగుంట మండలం వరకు పరిమితమైంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లి, చిట్వేలి, పుల్లంపేట, పెనగలూరు, కోడూరు మండలాల్లో ఉన్న ఆరు సెక్షన్ల విద్యుత్తు సిబ్బంది తిరుపతి టౌన్ డివిజన్ ఈఈ పరిధిలోనికి వస్తారని స్పష్టం చేశారు. ఇకపై కోడూరు నియోజకవర్గంలోని విద్యుత్తు వినియోగదారులు వారి సమస్యల పరిష్కారం కోసం కడపకు వెళ్లాల్సిన అవసరం లేదని, తిరుపతి డివిజన్కు రావాల్సి ఉంటుందన్నారు.
నేడు గ్రీవెన్స్ రద్దు
తిరుపతి అర్బన్: సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన నేపథ్యంలో సోమవారం పీజీఆర్ఎస్ను కలెక్టరేట్తోపాటు సచివాలయం, మండల, డివిజన్ కార్యాలయాల్లోనూ రద్దు చేశారు. అధికారులందరూ సీఎం కార్యక్రమాలలో పాల్గొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.


