తిరుపతి కల్చరల్ : శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో శనివారం రాత్రి కమనీయంగా సీతారాముల కల్యాణం నిర్వహించారు. అందులో భాగంగా సర్వాంగసుందరంగా అలంకరించిన ఉత్సవమూర్తులను ఆలయ ఆవరణలోని కల్యాణ వేదికకు వేంచేపు చేశారు. అర్చకులు పుణ్యాహవచనం, సద్యో అంకురార్పణ, రక్షాబంధనం, విశేషారాధన చేపట్టారు. అనంతరం రక్షా బంధన, అగ్రిప్రతిష్ట, మధుపర్కరం, కన్యాదానం, మహా సంకల్పం, స్వామి, అమ్మవారికి ప్రవరలు, మాంగల్య పూజను శాస్త్రోక్తంగా జరిపించారు. వేద మంత్రోచ్చరణలు, భక్తజనం రామనామ స్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని కల్యాణాన్ని తిలకించి పునీతులయ్యారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను ఊరేగించారు. టీటీడీ ఈఓ రవిచంద్ర, ఆలయ డిప్యూటీ ఈఓ నాగరత్న, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ పాల్గొన్నారు.
ఆభరణాల బహూకరణ
సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుంచి ఒక బంగారు గజలక్ష్మీ పతకం, రెండు వెండి దీప స్తంభాలు రూ.62.44 లక్షలు విలువ చేసే అభరణాలు బహూకరించారు. తిరుమల నుంచి పేష్కార్ రామకృష్ణ, బొక్కసం ఇన్చార్జి గురురాజస్వామి తీసుకువచ్చి డిప్యూటీ ఈఓ నాగరత్నకు అందజేశారు.
ముత్యాల తలంబ్రాలు ఊరేగింపు
సీతారాముల కల్యాణం సందర్భంగా ఉదయం 9 గంటలకు టీటీడీ పరిపాల నా భవనం నుంచి ఏనుగు మీ ద ముత్యాల తలంబ్రాలను ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయ అధికారులకు అందించారు.


