చంద్రగిరి: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని పోషణ ఇంక్యుబేటర్ రాష్ట్రంలోనే అగ్రగామినిగా నిలిచిందని వీసీ శారదా జయలక్ష్మి తెలిపారు. బుధవారం తిరుపతిలోని వ్యవసాయ కళాశాలలో పలు అంకుర సంస్థల ఔత్సాహికులకు ప్రోత్సాహకంగా రూ.1.01 కోట్ల గ్రాంట్లు పంపిణీ చేశారు. సీడ్ కేటగిరి కింద 12 మందికి, ప్రీ–సీడ్ కేటగిరీ కింద ఇద్దరిని గుర్తించారు. ఈ క్రమంలోనే అంకుర సంస్థలతో ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పోషణ ఇంక్యుబేటర్ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వర్చువల్గా హాజరైన వీసీ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు పోషణ ఇంక్యుబేటర్ విశేషంగా కృషి చేస్తోందన్నారు. యువత కొత్త ఆలోచనలతో ఆధునిక వ్యవసాయం దిశగా అడుగులు వేయాలని కోరారు. డాక్టర్ సుమతి మాట్లాడుతూ వ్యవసాయ అంకుర సంస్థలు ముందుకు సాగేందుకు గ్రాంట్లు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నారు. సాంకేతికత వినియోగం పెంచడం ద్వారా రైతులకు మేలు చేకూర్చే ఆవిష్కరణలను ప్రోత్సహించాలని సూచించారు. ఔత్సాహికులు మాట్లాడుతూ గ్రాంటు నగదుని వినియోగించి వ్యవసాయ రంగంలో నూతన మార్పులు తీసుకురావడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. పోషణ ఇంక్యుబేటర్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ కదిరి మోహన్ పాల్గొన్నారు.


