కరీంనగర్అర్బన్: చికెన్ ధర ఎన్నడూ లేనివిధంగా ఎగబాకింది. జిల్లా చరిత్రలోనే తొలిసారిగా రికార్డుస్థాయికి చేరగా వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో ధర ఎక్కువగా ఉండటం సహజం. అప్పుడున్న వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతల దృష్ట్యా కో ళ్లను కాపాడుకోవడమే సవాల్. డిమాండ్కు సరి పడా ఉత్పత్తి లేక ధర పెరుగుతోంది. కాగా, సా ధారణ పరిస్థితుల్లో అసాధారణ ధర ఉండడం ఆందోళనకర పరిణామం. మరో పక్షం రోజులు గడిస్తే రూ.450 చేరడం లాంఛనమే. ప్రస్తుతం కి లో కోడి ధర రూ.185 కాగా, కిలో స్కిన్లెస్ చికెన్ రూ.350 ఉండగా రిటైల్ వద్ద మరింత ఎక్కువే.
తినేవారికి తప్ప అందరికీ లాభాలే
బాయిలర్ కోళ్ల పరిశ్రమ నాలుగునెలలుగా లాభాల బాట పడుతోంది. పౌల్ట్రీ రంగంలోకి కార్పొరేట్ శక్తులు రావడమే కాకుండా హెచ్చు కోళ్ల ఫారాలు వాళ్ల చేతికే చేరాయి. ఫారం యజమానులు ధరల హెచ్చుతగ్గుదలతో కంపెనీకే అప్పగిస్తున్నారు. యజమానులు నిర్వహిస్తున్నవి చాలా తక్కువే. కాగా ధరల నిర్ణయం సదరు కంపెనీలే నిర్ణయిస్తుండగా ప్రభుత్వ నియంత్రణ ఏ మాత్రం ఉండదు. కోళ్ల ఫారం నిర్వహణలో యువత అమితాసక్తి చూపుతుండగా లాభాలతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే కోడి పిల్లలు ఉత్పత్తి చేసేవారు, దాణా విక్రేతలు, ఫారాల నుంచి కోళ్లు వేసే ట్రేడర్లు, చికెన్ సెంటర్లకు లాభాలే తప్ప నష్టం చాలా తక్కువ. ఫారం యజమానులకే లక్కీ లాటరీల ఉండేది. కానీ.. మూడునెలలుగా అందరికీ లాభాలే. 6 నెలల క్రితం వరకు 2 వేల కోళ్లను యజమాని పెంచితే రూ.20–30వేల లాభం రాగా తాజాగా రూ.లక్షల నుంచి రూ.1.50 లక్షల లాభం వస్తోందని తెలుస్తోంది.
కార్పొరేట్ శక్తుల రాకతో..
పౌల్ట్రీ పరిశ్రమలో కార్పొరేట్ శక్తుల రాకతో పౌల్ట్రీ రైతులు వెట్టిచాకిరికే పరిమితమవుతున్నారు. లక్షలు వెచ్చించి షెడ్లు నిర్మించుకున్న తర్వాత పెట్టుబడులు పెట్టలేని స్థితిలో రైతులు కార్పొరేట్ శక్తులను ఆశ్రయించాల్సి వస్తోంది. అయితే కార్పొరేట్ శక్తులు కోడి పిల్లల నుంచి దాణా వరకు అంతా వారే సరఫరా చేస్తారు. అయితే రైతులు షెడ్తో పాటు విద్యుత్, కోళ్లను చూసుకోవాలి. 45 రోజుల పాటు కష్టపడాల్సి వస్తోందని, అయితే మార్కెట్లో ధర వచ్చాక కూడా తక్కువ ధరే ఇస్తున్నారని, గిట్టుబాటుకావడం లేదని రైతులు వాపోతున్నారు.
పౌల్ట్రీ రైతులకు ఏదీ చేయూత
పౌల్ట్రీ రైతులకు ప్రభుత్వ ప్రొత్సాహం కరువైంది. పౌల్ట్రీని ఏర్పాటు చేసుకునే రైతులకు పావలా వడ్డీ రుణాలు ఇస్తామని చెబుతున్నా అది ఎక్కడా అమలు కావడం లేదు. పావలా వడ్డే కదా..ని చాలా మంది యువ రైతులు కరీంనగర్, హుజూ రాబాద్, చొప్పదండి, తదితర ప్రాంతాల్లో పోటీపడి బాయిలర్ కోళ్ల షెడ్లను ఏర్పాటు చేసుకున్నారు. బ్యాంకు రుణం ఇచ్చే సమయంలో పావలా వడ్డీ అని చెప్పి, ఇప్పుడు ప్రభుత్వం నుంచి తమకు ఏమి రాలేదని, రూ.1.10 చెల్లించాలి్సందేనని బ్యాంకర్లు చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. జిల్లాలో 20లక్షల బాయిలర్, 5లక్షల లేయర్ కోళ్ల పెంపకం జరుగుతున్నట్లు అంచనా.
ధరలపై నియంత్రణ ఉంటేనే ప్రయోజనం
ఇష్టారీతిగా చికెన్ ధరలు పెరుగుతుండగా వినియోగదారులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఇప్పటికే గ్యాస్ కొరత, పప్పులు, నూనె ధర పెరగడంతో అదనపు భారం పడుతోంది. తాజాగా చికెన్ ధరలు పెరగడం మరింత భారమే. ప్రభుత్వ నియంత్రణలో వినియోగదారులు, కోళ్ల ఫారం నిర్వాహకులకు గిట్టుబాటు ధర నిర్ణయిస్తేనే ప్రయోజనం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. \


