తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 23 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 78,381 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,451 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.46 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.
ఫిజిక్స్ పరీక్షకు
246 మంది గైర్హాజరు
తిరుపతి అర్బన్ : జిల్లాలో బుధవారం నిర్వహించిన పదోతరగతి భౌతికశాస్త్రం పరీక్షకు 246 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈఓ కేవీఎన్ కుమార్ వెల్లడించారు. మొత్తం 27,068 మందికి గాను 26,822 మంది విద్యార్థులు పరీక్షకు హజరైనట్లు వివరించారు. అలాగే ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ టెన్త్ పరీక్షలకు సంబంధించి 839 మంది విద్యార్థులకు 732 మంది మాత్రమే హాజరయ్యారని, 107 మంది రాలేదన్నారు. ఈ క్రమంలోనే నాలుగు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశామని తెలిపారు. జిల్లా మానిటరింగ్ కో–ఆర్డినేటర్ 5, ఫ్లయింగ్ స్క్వాడ్ 27, సిట్టింగ్ స్క్వాడ్ 33 కేంద్రాలను పరిశీలించినట్లు వివరించారు.
లాసెట్ దరఖాస్తుకు
గడువు పెంపు
తిరుపతి రూరల్ : రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో పద్మావతి మహిళా వర్సిటీ మే 4వ తేదీన నిర్వహిస్తున్న ఏపీ లా సెట్, పీజీ లాసెట్కు గడువు పొడిగించినట్లు కన్వీనర్ సీతాకుమారి తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ అభ్యర్థులు రూ.1000 ఆలస్య రుసుముతో ఈ నెల 28వ తేదీ, రూ.2వేలతో 31, రూ.4వేలతో ఏప్రిల్ 3, రూ.10వేలు చెల్లించి 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు వివరించారు.
ఎస్వీ ఆర్ట్స్ కళాశాల విద్యార్థి ప్రతిభ
తిరుపతి సిటీ : థాయ్లాండ్లోని బ్యాంకాక్లో ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది. విజేత జట్టులో ఎస్వీ ఆర్ట్స్ కళాశాలకు చెందిన విద్యార్థి మనోజ్కుమార్ ఉత్తమ ప్రతిభను కనబరిచాడు. బుధవారం ఈ మేరకు మనోజ్కుమార్ను ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. పీడీ డాక్టర్ ముస్తాక్, అధ్యాపకులు పాల్గొన్నారు


