పిచ్చాటూరు మండలం మాలగుంట క్వారీ నుంచి జోరుగా అక్రమ రవాణా రోజూ వందలాది టిప్పర్ల లోడ్లు తమిళనాడుకు..! అనుమతులు గోరంత.. తవ్వకాలు కొండంత
సాక్షి టాస్క్ఫోర్స్: ఆంధ్ర–తమిళనాడు సరిహద్దులోని సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలంలో గ్రావెల్ దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. రోజూ వందలాది టిప్పర్ల లోడ్లతో తమిళనాడుకు దర్జాగా తరలిస్తున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి.తమిళనాడులో ఇక్కడి గ్రావెల్ మట్టికి మంచి డిమాండ్ ఉంది. దీంతో ఒక్కో టిప్పర్ గ్రావెల్ రూ.30 వేల నుంచి రూ.50 వేలు వరకు ఉండడంతో ఇదే అవకాశంగా అధికార పార్టీకి చెందిన బడా నేతలు రూ. కోట్లు దండుకుంటున్నారు. పిచ్చాటూరు మండలంలోని మాలగుంట, కారూరు, వెంకటరెడ్డి కండ్రిగ, బంగాళ గ్రామాల్లో గ్రావెల్ క్వారీ నుంచి ఎర్రమట్టి రోజూ వందలాది లోడ్లు తరలిస్తున్నారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ప్రభుత్వ భూముల నుంచి ఈ దోపిడీ చేస్తున్నారు. దీనిపై స్థానికులు పలుచోట్ల అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ తమకు అనుమతులు ఉన్నాయని బుకాయిస్తూ వారిపైనే దౌర్జన్యం చేస్తున్నారు. అడ్డొస్తే తొక్కించి మరీ వెళ్తామని వార్నింగ్ ఇస్తూండడంతో వెనుకంజ వేస్తున్నారు. పబ్లిగ్గా ఇంత జరుగుతున్నప్పటికీ మైనింగ్ శాఖ అధికారులు మొదలు పోలీస్, రెవెన్యూ యంత్రాంగాలు ఏ మాత్రం చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పదుల సంఖ్యలో స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నా..వారికి అనుమతులున్నాయంటూ సాక్షాత్తు అధికారులే చెబుతుండడంతో గ్రావెల్ మాఫియా పేట్రేగిపోతోంది. ఉన్నతాధికారులైనా స్పందించి దీనికి అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.
క్వారీలో టిప్పర్లకు మట్టి నింపుతున్న హిటాచీలు


