తిరుపతి అర్బన్ : జిల్లా పారదర్శకంగా కుల ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ క్యాస్ట్ వెరిఫికేషన్ ప్రక్రియను పకడ్బందీ పూర్తి చేసిన తర్వాతే సర్టిఫికెట్ మంజూరు చేయాలని స్పష్టం చేశారు. అసంపూర్ణ పత్రాలు, తప్పుడు సమాచారం ఆధారంగా సర్టిఫికెట్ జారీ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే మ్యుటేషన్, రీసర్వేలో జాప్యం లేకుండా చూడాలని సూచించారు. 22ఏ అంశాల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. పట్టాదారు పాస్ పుస్తకాల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి త్వరితగతిన భూసేకరణ చేపట్టాలని ఆదేశించారు. శ్రీసిటీ సమీప ప్రాంతాల్లో పెండింగ్ ప్రాజెక్టులకు భూసేకరణ, కోర్టు కేసుల పరిష్కారం అంశాలపై దృష్టి పెట్టాలని చెప్పారు. సమావేశంలో ఆర్డీఓలు రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, దేవేంద్ర రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రోజ్ మాండ్, అనురాధ, భరత్ నాయక్, డిప్యూటీ కలెక్టర్ గీతాంజలి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ విజయ్భరత్రెడ్డి, ల్యాండ్ అండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ అరుణ్ కూమర్, శ్రీసిటీ మేనేజర్ భగవాన్ పాల్గొన్నారు.
తడలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు
సూళ్లూరుపేట: మండల కేంద్రమైన తడలో మంగళవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, రెవెన్యూ అధికారులు దాడులు చేశారు. తడ కండ్రిగ పరిధిలోని శ్రీకాళహస్తి రోడ్డులో ఎస్ఎస్ఆర్ వైన్ షాపు, కేఆర్ జీవా ఫ్రైడ్ రైస్ షాప్లో నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. వారిపై 6–ఏ కేసులు నమోదు చేశారు. దాడుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏఓ రామాంజనేయులురెడ్డి, హెడ్ కానిస్టేబుల్ పీ.వెంకటాద్రి, రెవెన్యూ అధికారులు వనజ, ఆర్ఐ వీ.భారతి పాల్గొన్నారు.


