– కలెక్టరేట్లో పీజీఆర్ఎస్కు 294 అర్జీలు
తిరుపతి అర్బన్: పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీలను పరిష్కారించడంలో నిర్లక్ష్య చూపవద్దని, అలా కాదని నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ గోవిందరావు హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లో జేసీతోపాటు డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్నాయక్, రోజ్మాండ్, అనురాధ, గీతాంజలి తదితరులు అర్జీదారుల నుంచి 294 అర్జీలను స్వీకరించారు. అందులో ప్రధానంగా 183 అర్జీలు రెవెన్యూ సమస్యలపై అందుకున్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఏ విభాగానికి చెందిన అర్జీలను ఆ విభాగానికి చెందిన అధికారులు వేగవంతంగా పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు.
ఇంటర్ విద్యార్థి ఆచూకీ తెలపండి..
తిరుపతి రూరల్ మల్లంగుంటలోని ఓ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్న ఇంటర్ విద్యార్థి జస్వంత్రెడ్డి ఈ నెల 11న కళాశాల హాస్టల్ నుంచి అదృశ్యమయ్యారని, ఇప్పటి వరకు కనిపించడం లేదని వైఎస్సార్ ఎస్యూ, ఎన్ఎల్ఎస్ఐ, ఏన్ఎస్యూఐ, ఓబీసీ, బీసీ యువజన, జీజేఎస్ విద్యార్థి సంఘాల నేతలు అన్నారు. జస్వంత్రెడ్డి తల్లిదండ్రులతో కలసి విద్యార్థి సంఘం నేతలు జాయింట్ కలెక్టర్కు సోమవారం కలెక్టరేట్లో ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యాక్షుడు ఓబుల్రెడ్డి, నేషనల్ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుందర్రాజు, ఎన్ఎస్యూవై జిల్లా అధ్యక్షుడు శివబాలాజీ, జీజేఎస్ అధ్యక్షుడు మహేంద్ర నాయక్, ఓబీసీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు విజయ్ ఉత్తరాది, బీసీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్యాదవ్, విద్యార్థి సంఘం నేతలు చెంగల్రెడ్డి, యశ్వంత్రెడ్డి, రఫీ, వినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు.


