నాగలాపురం: సూర్యపూజకు రెండు రోజుల ముందే ఆలయంలోకి సూర్య కిరణాలు ప్రవేశించాయి. మండలంలోని టీటీడీ అనుబంధంగా ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వేదనారాయణ స్వామి ఆలయంలో ఈ నెల 24 నుంచి 28 వరకు సూర్యపూజ, తెప్పోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇందులో మొదట మూడు రోజులు సాయంత్రం 5.30 నుంచి 6 గంటల సమయంలో సూర్యుడు అస్తమించే సమయంలో ఆలయం ప్రధాన గోపురం మీదుగా సూర్య కిరణాలు 630 అడుగులు దూరంలో ఉన్న ఆలయ గర్భగుడిలోని స్వామివారి పాదాలను తాకడం విశేషం. మొదటి రోజు పాదాలు, రెండవ రోజు నాభి, మూడో రోజు శిరస్సుపై కిరణాలు తాకుతాయి. ఈ మేరకు ఆదివారం సూర్యపూజకు రెండు రోజుల ముందే ముందుస్తుగా సూర్యుడు అస్తమించే సమయంలో ఆలయ ప్రధాన గోపురంలోని రెండో మెట్టును సూర్యకిరణాలు తాకాయి.
నేడు ‘డయల్ యువర్ ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ’
తిరుపతి రూరల్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 23వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆ సంస్థ సీఎండీ కార్యాల యం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు మొబైల్ నంబరు 89777 16661కు కాల్ చేసి, తమ విద్యుత్ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు.


