రాజంపేట : పుల్లంపేటకు చెందిన శంకరమ్మ గర్భసంచిలోనే బిడ్డ మృతి చెందగా పరిస్థితి సంక్లిష్టమైంది. దీంతో ఆమె రాజంపేట ప్రభుత్వ వైద్యులను సంప్రదించగా వారు ఆపరేషన్ విజయవంతం చేసి, ఆ మహిళకు పునర్జన్మనిచ్చారు. రైల్వేకోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలంలోని శంకరమ్మ గర్భసంచిలో పిండం చనిపోయింది. మూడు నెలలుగా తిరుపతిలోని అనేక పేరొందిన కార్పొరేట్ ఆస్పత్రుల్లో చూపించినా ఎటువంటి ఫలితం లేకపోయింది. బీపీ అధికంగా ఉన్న కారణంగా కార్పొరేట్ ఆస్పత్రులు ఆపరేషన్ చేయడానికి ముందుకు రాలేదు. ఆపరేషన్ తర్వాత వచ్చే రక్తస్రావానికి సంబంధించి అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయన్న భయం కార్పొరేట్ వైద్యులను వెంటాడింది. దీంతో చికిత్సతోపాటు ఆపరేషన్కు నిరాకరించారు. ఆమె ప్రాణానికే ముప్పు వాటిల్లుతుందనే అనుమానాలతో తిరుపతి వైద్యులు ముందుకు రాలేదు. డిక్ డీఐసీ అనే క్లాంపికేషన్తో తల్లికి ప్రాణపాయం ఉందని ఆపరేషన్ చేసేందుకు నిరాకరించినట్లు సమాచారం. చివరికి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో శంకరమ్మను కుటుంబ సభ్యులు రాజంపేట ప్రాంతీయ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ పీవీఎన్ రాజు దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన డిప్యూటీ సివిల్ సర్జన్ గైనకాలజిస్టు డాక్టర్ అనిల్కు కేసును అప్పగించారు. ఈయన నేతృత్వంలో అనిస్థీయా డాక్టర్ అబూబకర్, ఫిజిషియన్ డాక్టర్ గిరి, నర్సులు సరళ, శ్రీలక్ష్మి, అసిస్టెంట్ విజయ్ తదితరులు శంకరమ్మ గర్భంలో మృతి చెందిన పిండాన్ని బయటికి తీసేందుకు సంక్లిష్టమైన ఆపరేషన్ చేసి, చనిపోయిన పిండాన్ని తీసేశారు. గర్భిణికి ఎలాంటి ప్రమాదం లేకుండా సురిక్షతమైన ఆపరేషన్ విజయవంతంగా చేశారు. ప్రస్తుతం శంకరమ్మ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సూపరింటెండెంట్ డాక్టర్ పీవీఎన్రాజు, డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ చట్టేటి అనిల్కుమార్ తెలిపారు.


