తిరుపతి సిటీ: భవిష్యత్తులో ఉన్నత విద్యలో గణనీయంగా మార్పులు రాబోతున్నాయని, ఇందుకోసం విశ్వవిద్యాలయాలు, అధ్యాపకులు సన్నద్ధం కావాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య మధురమూర్తి తెలిపారు. శుక్రవారం ఎస్వీయూను సందర్శించిన ఆయన వీసీ తాతా నర్సింగరావు, రెక్టార్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతినాయుడుతో కలిసి ప్రిన్సిపాళ్లు, డీన్లతో సమావేశమై, పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు శిక్షణ, ఉద్యోగ కల్పనపై దృష్టి పెట్టాలని, అకడమిక్ క్యాలెండర్ కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని విశ్వవిద్యాలయాలు ఒకే సారి పరీక్షలు నిర్వహించాలని కోరారు. లా, ఎడ్యుకేషన్, ఫార్మసీ కోర్సుల్లో గత సంవత్సరం ఆలస్యంగా అడ్మిషన్లు జరిగాయని, లోకల్, నాన్ లోకల్ విధానం కోసం సుప్రీంకోర్టు తీర్పు కోసం ఆలస్యమైందన్నారు. కృత్రిమ మేధస్సుతో మంచి ఫలితాలు వస్తాయని, అయితే విద్యార్థులతో ముఖాముఖి ఉండదని, ఇది పాఠాలు చెప్పడం ఛాలెంజ్గా మారుతున్న దశ అన్నారు. పరిశోధనల విషయంలో కొన్ని విశ్వవిద్యాలయాలు కలసి క్లస్టర్గా ఏర్పడి పరిశోధనలు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ సమావేశంలో ప్రిన్సిపాళ్లు ఆచార్య సుధారాణి, ఆచార్య వెంకటేశ్వర్లు, ఆచార్య ఓవీఎస్ రెడ్డి, ఆచార్య శ్రీనివాసులు, డీన్లు ఆచార్య బాలాజీ, ఆచార్య నరసింహ, రమేశ్ బాబు, ఆచార్య రాజేంద్ర ప్రసాద్, ఆచార్య పీసీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


