తిరుపతి ఎడ్యుకేషన్ : నగరంలోని రీజినల్ సైన్స్ సెంటర్లో ఈ నెల 8వ తేదీన హైడ్రోపోనిక్స్ (మట్టి లేని వ్యవసాయం)పై వర్క్షాపు నిర్వహించనున్నారు. ఆ మేరకు సైన్స్ సెంటర్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ కె.శ్రీనివాస నెహ్రూ ఓ ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సైన్స్ సెంటర్, జేసీఐ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే వర్క్షాపులో మహిళలు, బాలికలు ఉచితంగా పాల్గొనవచ్చని తెలిపారు. ఆసక్తి ఉ న్న వారు ‘‘హెచ్టీటీపీఎస్://టీఐఎన్వైయూఆర్ఐ.కామ్/ఐడబ్ల్యూడీ26ఆర్ఎస్సీటీ’’ అనే వెబ్సైట్లో నమోదు చేసుకోవాలన్నారు. మ రిన్ని వివరాలకు 0877–2286202, 79896 94681నంబర్లో సంప్రదించాలని ఆయన కోరారు.
15 ఏళ్ల తర్వాత జనగణన
తిరుపతి అర్బన్: 15 ఏళ్ల తర్వాత దేశవ్యాప్తంగా జనగణన ప్రక్రియ మొదలుపెట్టారని కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. మంగళవారం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో జిల్లాలో నిర్వహించనున్న జనగణణ–2027లో భాగంగా మొదటి విడతలో నిర్వహించే హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్పై జిల్లా స్థాయిలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగణనపై తిరుపతిలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న శిక్షణకు ఉద్యోగులు తప్పకుండా హజరుకావాలన్నారు. ఈ సారి జనగణన ప్రక్రియ గతం కంటే భిన్నంగా పూర్తి డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారని, సెన్సె స్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ రూపొందించిందన్నారు. హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సి ఉంటుందన్నారు. అధికారులు నిబద్ధతతో పనిచేయాలని ఆదేశించారు. జనగణనలో పాల్గొంటున్న సిబ్బంది ఎప్పటికప్పుడు తమ పైఅధికారుల సూచనలను పాటించాల్సి ఉంటుందన్నారు. శిక్షణ తరగతుల్లో భాగంగా మెటీరియల్ను అందిస్తామని, దాన్ని చదివి పూర్తి అవగాహన చేసుకున్న తర్వాత ఎన్యూమరేటర్లుకు వివరించాలని చెప్పారు. త్వరలో మాస్టర్ ట్రైనర్లను ఎంపిక చేసి ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణ ఇస్తారని, ఫీల్డ్ ట్రైనర్లు మండల, మున్సిపల్ పరిధిలో చార్జ్ ఆఫీసర్లకు, అలాగే సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లకు శిక్షణ ఇస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోవిందరావు, ట్రైనీ కలెక్టర్ రఘువంశీ, డీఆర్వో నరసింహులు, రాష్ట్రస్థాయి నుంచి సెన్సెస్ అసిస్టెంట్ డైరెక్టర్ కే.సుప్రీజ్ పాల్గొన్నారు.


