జవాబు పత్రాల తరలింపు
తిరుపతి సిటీ: ఈ నెల 23వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల కోసం జిల్లా లో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాలకు జవాబు పత్రాలను అధికారులు తరలించారు. ఈమేరకు బుధవారం తిరుపతి జిల్లా ఆర్ఐఓ కార్యాలయం నుంచి 84 పరీక్షా కేంద్రాలకు అధికారులు, సిబ్బంది పలు వాహనాల్లో ఆన్సర్ బుక్లెట్లను తీసుకెళ్లారు. విద్యార్థులు జవాబులు రాసేందుకు వీలుగా సబ్జెక్టుల వారిగా ప్రశ్నల సరళి ఆధారంగా అవసరాన్ని బట్టి 24, 32 పేజీలతో రెండు రకాల జవాబు పత్రాలను అందించనున్నారు.
ఆర్టీసీకి రూ.56.18 లక్షల ఆదాయం
శ్రీకాళహస్తి: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహాశివరాత్రి, రథోత్సవం, కల్యాణోత్సవం ఈ మూడు రోజులకు గాను రూ.56.18 లక్షల ఆదాయం వచ్చినట్లు శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో మేనేజరు రేవతి తెలిపారు. ఆమె బుధవా రం విలేకరులతో మాట్లాడుతూ ఆదాయం రావడానికి సహకరించిన డిపోలోని సిబ్బంది ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, కండక్టర్లు, డ్రైవర్లు, గ్యారేజ్, ట్రాఫిక్ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రొఫెసర్ హేమకు జాతీయ అవార్డు
తిరుపతి సిటీ: ఎస్వీ యూ వైరాలజీ విభాగంలో ప్లాంట్ వైరాలజిస్ట్గా విధులు నిర్వహిస్తున్న ప్రొఫెసర్ ఎం.హేమ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సేంద్రియ వృక్ష సంరక్షణ పరిశోధనలో కృషిచేసిన వారికి ప్రతి మూడేళ్లకోసారి అందించనున్న దొడ్ల రాఘవరెడ్డి మెమోరియల్ అవార్డును 2023–25 సంవత్సరానికి ప్రొఫెసర్ హేమకు అందించనున్నారు. ఈనెల 26వ తేదీ నుంచి 28వరకు హైదరాబాద్ వేదికగా జరగనున్న ‘‘స్థిరమైన వ్యవసాయం, వ్యవసాయ–ఎగుమతి ప్రమోషన్ కోసం మొక్కల ఆరోగ్య నిర్వహణలో ఆవిష్కరణలు’’ అనే జాతీయ సమావేశంలో ఆమెకు అవార్డుతో పాటు నగదు బహుమతిని అందజేయనున్నారు. ఈ సందర్భంగా వీసీ, రెక్టార్, రిజిస్ట్రార్, అధ్యాపకులు ఆమెకు అభినందనలు తెలిపారు.
లిఫ్ట్ అడిగి బంగారు గొలుసు చోరీ
తిరుపతి రూరల్ : ద్విచక్ర వాహనదారుడిని లిఫ్ట్ అడిగి అతని మెడలోని బంగారం గొలుసు లాక్కెళ్లిన దుర్ఘటన తిరుపతి నగర శివార్లలో బుధవారం చోటు చేసుకుంది. బాధితుని ఫిర్యాదు మేరకు.. తిరుపతి రూరల్ మండలం పేరూరు గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీరు రఘునాథరెడ్డి బుధవారం ద్విచక్ర వాహనంలో చెర్లోపల్లి జంక్షన్ నుంచి అలిపిరి వైపు వెళుతున్నాడు. అదే మార్గంలోని ఒక వైన్ షాపు ముందు నిలుచున్న వ్యక్తి జూపార్క్ వద్ద దింపాలని లిఫ్ట్ అడగడంతో ఎక్కించుకున్నాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత వెనుక కూర్చున్న వ్యక్తి మూత్ర విసర్జన చేయాలని, వాహనాన్ని ఆపాలని చెప్పడంతో రఘునాథరెడ్డి తన బైక్ను ఆపాడు. కిందకు దిగిన ఆ గుర్తు తెలియని వ్యక్తి హఠాత్తుగా రఘునాథరెడ్డి మెడలోని 18 గ్రాముల బంగారం చైను లాక్కుని రిక్షాకాలనీ మీదుగా చెట్లలోకి పారిపోయాడు. బాధితుడు, సమీపంలోని కొందరు వ్యక్తులు పరుగులు తీసినప్పటికీ ఫలితం లేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు తిరుపతి రూరల్ ఎస్ఐ శ్రీరాములు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అపరిచిత వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వరాదని పోలీసులు హెచ్చరించారు.
జవాబు పత్రాల తరలింపు


